
- కేసు పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయించినం
- రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది
- నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించిన రాంచందర్రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: దళిత బిడ్డ వేముల రోహిత్ ఆత్మహత్యలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో త్వరలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు ఉండాలని కోరుకునే వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. రోహిత్ వేముల కేసును పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అతడి మృతికి కారకులైనవారిని ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నతమైన పదవులను కట్టబెట్టిందని ఆరోపించారు.
శుక్రవారం ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీ ఎస్సీ వింగ్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్తో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ప్రవేశం పొందే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తోపాటు ఇంత విషం, ఒక తాడు కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది’’ అని చెప్పారు. హెచ్సీయూలో ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన హక్కులు కల్పించండి అంటూ వర్సిటీ వీసీకి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వినతి పత్రాన్ని ఇచ్చారన్నారు.
ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని హెచ్సీయూ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్కుమార్.. రోహిత్ వేములతో పాటు అసోసియేషన్లోని మరో నలుగురు సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి కంప్లయింట్ చేశారన్నారు. ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో.. యూనియన్ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేశారన్నారు. నలుమూలల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్ వేములతోపాటు మరో నలుగురిని రెస్ట్గేట్ చేశారని గుర్తుచేశారు. మరో మార్గం లేక రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని భట్టి విక్రమార్క వివరించారు.
కలిసి టీం వర్క్గా పని చేస్తున్నం
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం బాగానే ఉందని, అందరం కలిసి టీం వర్క్తో పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమి లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ భవన్ శబరి బ్లాక్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటో తెలియదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. రైతు భరోసా ఇచ్చామని , ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని వివరించారు. ప్రతి పేదింటికి సన్న బియ్యం అందుతున్నాయని చెప్పారు.
ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి, మరొకరి ప్రొఫెసర్ పోస్ట్
ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు హెచ్సీయూకి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచంద్రరావును.. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానియమించిందని భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న సుశీల్ కుమార్ను.. ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులను ఇబ్బంది పెట్టి.. వారు మరణం అంచుల దాకా వెళ్లేలా టార్గెట్ చేసే వారికి బీజేపీ నాయకత్వం పదవులు, ప్రోత్సాహకాలు ఇచ్చి తమ మార్క్ను చూపించుకుంటున్నదని ఫైర్ అయ్యారు. దళిత బిడ్డలపై చూపుతున్న వివక్షకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.