
- మంత్రి పొన్నంతో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
- పలు అభవృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం/ ఖమ్మం కార్పొరేషన్/మధిర, వెలుగు: ప్రభుత్వం నిబంధనల ప్రకారం గురుకులాలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో వివిధ పథకాలపై ఆయన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్షించారు. అంతకుముందు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో విద్యుత్ అంబులెన్స్లను మంత్రులు ప్రారంభించారు. సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరయ్యారు.
గురుకులాల నిర్వహణ, స్టడీ సర్కిల్ పని తీరు, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ పని తీరు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ హాస్టళ్లలో అవసరమైన రిపేరు పనులు పూర్తి చేయాలన్నారు. 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. కామన్ డైట్ ప్రోగ్రాం సంబంధించి షెడ్యూల్ తప్పనిసరిగా డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గురుకులాలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని సూచించారు. వన మహోత్సవంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కోటి మొక్కల వరకు పెంచుతున్నామన్నారు. ప్రతీ మొక్క మీద ప్రభుత్వం కనీసం రూ.300 వరకు ఖర్చు చేస్తోందని, ఉమ్మడి జిల్లాలో సంవత్సరానికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
ఉద్యోగాలు సాధించేలా చూడాలి..
గ్రామీణ యువతకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు, శిక్షణ ఖమ్మంలో అందించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో 81 వేల ఈత మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, గీత కార్మికుల సొసైటీ లను వీటిలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత నూతన బస్సు సర్వీసుల కోసం డిమాండ్ వస్తుందని, స్థానిక ఎమ్మెల్యేల నుంచి బస్సు సర్వీసుల ప్రతిపాదనలు తీసుకొని అందించాలన్నారు.
నగర పరిధిలో పీఎంఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో రూరల్ కనెక్టివిటీ బస్సుపై స్టడీ చేసి నూతన రూట్లను ప్రతిపాదించాలన్నారు. లాండ్రీ లకు, దోబి ఘాట్, సెలూన్ లకు విద్యుత్ సరఫరా సజావుగా అందించాలని సూచించారు. గురుకులాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
మధిర బస్ స్టేషన్ కు శంకుస్థాపన
మధిరలో రూ.10కోట్లతో నిర్మించనున్న కొత్త బస్స్టేషన్కు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్ధాపన చేశారు. నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సు స్టాండ్ ల్లో రూఫ్ టాప్ పై సోలార్ విద్యుత్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బస్ స్టేషన్ దగ్గర్లోనే ఉన్న రైల్వే స్టేషన్ ను అనుసంధానం చేస్తూ నూతన బస్ స్టేషన్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం కొత్త బస్సును ప్రారంభించి, ప్రయాణికుల సీట్లలో కూర్చొని కొద్ది దూరం ప్రయాణించారు.
అంతకుముందు బోనకల్ మండలం జానకిపురంలో సబ్ స్టేషన్ లో అధునాతన టెక్నాలజీని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో సమస్యను అతి త్వరగా గుర్తించడానికి, ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు, కరీంనగర్ జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్ పాల్గొన్నారు.