గీతాంజలి సీక్వెల్‌‌తోనూ మెప్పిస్తుంది

గీతాంజలి సీక్వెల్‌‌తోనూ మెప్పిస్తుంది

అంజలి లీడ్ రోల్‌‌లో నటించిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకుడు. ఎంవీవీ సినిమాస్‌‌తో కలిసి కోన వెంకట్ నిర్మించారు. ఈరోజు సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులైన కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నా. అలాగే టాలీవుడ్‌‌కు మంచి విజయాలు రావాలని ఉగాది సందర్భంగా కోరుకుంటున్నా.  

ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్దంగా ఉన్నాం’ అన్నారు.  మరో అతిథి సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘సీక్వెల్స్ హిట్ అవ్వవు అన్న వాళ్లకు ‘టిల్లు స్క్వేర్‌‌’తో అట్లుంటది మనతోని అని చూపించా. ఈ సీక్వెల్‌‌ కూడా పెద్ద హిట్ అవుతుంది. టీమ్‌‌కు ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు. తెలుగమ్మాయి అంజలి 50 సినిమాలు చేయడం గర్వంగా ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, దర్శకులు వశిష్ట, నందినీ రెడ్డి, హేమంత్ మధుకర్, సింగర్ సునీత సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ‘గీతాంజలి చిత్రాన్ని ఎంతలా ఎంజాయ్ చేశారో..  దీన్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అని అంజలి చెప్పింది.  సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్​ను మిస్ అవ్వద్దని దర్శకుడు చెప్పాడు. ‘చిన్న కాన్సెప్ట్‌‌తో ‘గీతాంజలి’ తీయగా చాలా పెద్ద హిట్ అయింది. ఇది కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది’ అని కోన వెంకట్ అన్నారు. నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ కూడా మాట్లాడారు.