- ఈ నెల 14న వీఆర్ఎస్కు దరఖాస్తు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తహశీల్దార్ల సంఘం(టీజీటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నెల 14న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కు అనుమతి ఇవ్వాలని మెయిల్ ద్వారా చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేశారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. లచ్చిరెడ్డి కీసర ఆర్డీవోగా పని చేస్తున్నప్పుడు కేబినెట్లో చర్చించిన కొత్త రెవెన్యూ చట్టం గురించి తెలుసు కునేందుకు అప్పుటి మంత్రి ఈటల రాజేందర్ను కలిశారన్న కారణంతో సర్కారు.. ఆయనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూసేకరణ విభాగానికి డిప్యూటీ కలెక్టరుగా ట్రాన్స్ఫర్ చేసింది. ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్ ఇవ్వడంతో కొంతకాలంగా సెలవులో ఉన్న ఆయన.. స్వచ్ఛంద పదవీ విరమణ కు దరఖాస్తు చేసుకున్నారు.
లచ్చిరెడ్డికి మరో 16 ఏండ్ల సర్వీస్ ఉంది. కాగా, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ మధ్యే.. ల్యాండ్ డాక్స్ అనే సంస్థను అడ్వకేట్ సునీల్తో కలిసి లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.