
- ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఫైర్
- యూఎన్ మీటింగ్లో షెహబాజ్ షరీఫ్కు భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్ సమాధానం
న్యూఢిల్లీ: ‘‘ఆపరేషన్ సిందూర్లో భాగంగా ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లే మీ విజయమా?’’ అని పాకిస్తాన్ను భారత్ ప్రశ్నించింది. అలాగే, భావిస్తే ఆ విజయాన్ని ఆస్వాదించొచ్చు అంటూ చురకలంటించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు రుజువుగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పేర్కొన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ను ఓడించామని ప్రగల్భాలు పలికాడు.
ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పుకొచ్చాడు. హిందూత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు. షెహబాజ్ వ్యాఖ్యలను శనివారం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్లో పేటల్ గెహ్లాట్ తిప్పికొట్టారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఫైర్ అయ్యారు. పహల్గాం ఉగ్రాదాడికి పాల్పడ్డ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను పాకిస్తాన్ రక్షించిందని తెలిపారు. అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
యుద్ధం ముగించాలని పాక్ వేడుకున్నది
టెర్రరిజాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయిన పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడడంలేదని పేటల్ గెహ్లాట్ అన్నారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకున్నట్లు నటిస్తూనే.. దశాబ్దం పాటు బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించిందనే విషయం మర్చిపోకూడదన్నారు. ఆపరేషన్ సిందూర్కు భయపడి యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ను వేడుకుందని గుర్తుచేశారు. పాక్ నిజంగా శాంతిని కోరుకుంటే టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఆపేయాలని, భారత్ అడుగుతున్న ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్తో ఉన్న ఏ సమస్యనైనా ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకుంటామని, మూడో పక్షానికి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.