దేవాదుల ప్రాజెక్టును వేసవిలోపు పూర్తి చేయాలె : మంత్రి ఎర్రబెల్లి

దేవాదుల ప్రాజెక్టును వేసవిలోపు పూర్తి చేయాలె : మంత్రి ఎర్రబెల్లి

దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. హనుమకొండ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై కలెక్టరేట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్, జనగామ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు,  డాక్టర్ గోపి, కలెక్టర్ శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డితో పాటు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ ప్యాకేజీ కింద నాలుగు జిల్లాలు వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే  రీ టెండర్ పెట్టించినా అనుకున్నంత ముందుకు పోవడం లేదన్నారు. లోపాలు సరిదిద్దుకుని వేసవి కాలంలో పనులు పూర్తయ్యేలా పనిచేయాలని చెప్పారు.

6 నెలలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేళ్లవుతున్నా పూర్తికాలేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్న ఆయన... సీఎంతో మళ్ళీ రివ్యూ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్ గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందని, అందరూ సమన్వయం చేసుకుని పనులు వేగంగా చేయాలని సూచించారు.