శివసేన కలిసొస్తుంది.. కూటమి సర్కారు: ఫడ్నవిస్​

శివసేన కలిసొస్తుంది.. కూటమి సర్కారు: ఫడ్నవిస్​

శివసేన కలిసొస్తుంది.. కూటమి సర్కారు   
దేవేంద్ర ఫడ్నవిస్​ ధీమా..

    రెండోసారి బీజేఎల్పీ నేతగా ఎన్నిక

    అపోజిషన్​గానే ఉంటామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ క్లారిటీ​

     సైలెంటైపోయిన  శివసేన..
నేటి ఎల్పీ భేటీ తర్వాత ప్రకటన వెలువడే అవకాశం

 

మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, వచ్చే ఐదేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని దేవేంద్ర ఫడ్నవీస్​ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముంబైలోని విధాన భవన్​లో జరిగిన బీజేఎల్పీ మీటింగ్​లో 105 మంది ఎమ్మెల్యేలు తమ నేతగా ఫడ్నవీస్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి సెంట్రల్​ అబ్జర్వర్లుగా కేంద్రమంత్రి నరేంద్ర తోమర్​, బీజేపీ వైస్​ ప్రెసిడెంట్​ అవినాశ్​ రాయ్​ ఖన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఫడ్నవీస్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, ఆ మేరకు అతి త్వరలోనే శివసేన కలిసొస్తుందని, కొద్దిరోజుల్లోనే కొత్త సర్కారు కొలువుదీరుతుందని, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘ఈలోపే ప్రతిపక్షాలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనేది కేవలం పుకారే. అలాంటివాటిని ఎంటర్​టైన్​మెంట్​గానే తప్ప సీరియస్​గా చూడొద్దు.

వాస్తవానికి సేన సర్కారు ఫాం చేసే అవకాశం లేనేలేదు’’అని అన్నారు. సరిగ్గా అదే సమయానికి తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటాం తప్ప శివసేనతో కలిసి నడవబోమని ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్​లు కీలక ప్రకటన చేశాయి. దీంతో శివసేన దాదాపుగా మెత్తబడింది. బుధవారం ఆ పార్టీ నేతలెవరూ దూకుడు ప్రకటనలు చేయలేదు. గురువారం శివసేన ఎమ్మెల్యేలు తమ ఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఆ మీటింగ్​ తర్వాత పార్టీ చీఫ్​ ఉద్దవ్​ థాక్రే.. బీజేపీతో కలిసి నడిచే విషయమై కీలక ప్రకటన చేస్తారని తెలిసింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్​ 46 సీట్లను గెల్చుకోగా, మిగిలిన 29 స్థానాల్లో చిన్నపార్టీల కేండిడెట్లు, ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

దేవేంద్ర చాణక్యం

ఫిఫ్టీ–ఫిఫ్టీ ఫార్ములాపై మంకుపట్టుపట్టిన శివసేనను దారికి తెచ్చుకునే విషయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​​ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బుధవారం నాటి బీజేఎల్పీ మీటింగ్​కు బీజేపీ చీఫ్​ అమిత్​ షా హాజరుకావాల్సిఉండగా, చివరి నిమిషంలో షా బదులు కేంద్ర మంత్రి తోమర్​, పార్టీ వైస్​ ప్రెసిడెంట్ రాయ్​ని​ అబ్జర్వర్లుగా పంపుతున్నట్లు హైకమాండ్​ ప్రకటించింది. ఫడ్నవీస్​ రిక్వెస్ట్​ మేరకే అమిత్ షా ముంబై టూర్​ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ముందే నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం అమిత్ షా.. శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రేతోనూ సమావేశం కావాల్సిఉంది. ఆ మీటింగ్​ జరిగితే బీజేపీ చీఫ్​ ముందు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాపై థాక్రే తన వాదన మరోసారి వినిపించేవారు. దేవేంద్ర చాణక్యంతో థాక్రేకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈలోపే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించబోమంటూ ప్రకటించడంతో శివసేనకు వేరే ఆప్షన్స్ లేకుండాపోయాయి. బుధవారం మరో ఇద్దరు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు సీఎం ఫడ్నవీస్​కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతకుముందే ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్​ చేస్తామని లేఖలు రాశారు.

ఫ్లోర్​ టెస్టులో ఫడ్నవీస్ ఫెయిలైతేనే

మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. బుధవారం ముంబైలో సమావేశమైన 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ నేతగా అజిత్​ పవార్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేషనల్​ చీఫ్​ శరద్​ పవార్​తోపాటు పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. మహారాష్ట్రలో కొత్త సర్కారు ఏర్పాటుపై ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్​ పాటిల్​ కీలక ప్రకటన చేశారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్సీపీ, కాంగ్రెస్​ ప్రతిపక్షంలోనే కూర్చుంటాయని స్పష్టం చేశారు. ముందుకుముందే శివసేనతో కలిసి సర్కారు ఏర్పాటుకు ప్రయత్నించబోమని, ఒకవేళ సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీ ఫ్లోర్​ టెస్టులో ఫెయిలైతేనే  ప్రత్యామ్నయాలపై దృష్టిపెడతామని పాటిల్​ కుండబద్దలుకొట్టారు.

పరిశీలనలోని ఫార్ములాలు

కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో శివసేనకు సముచిత స్థానం కల్పించాలనుకుంటున్న బీజేపీ రెండు ఫార్ములాల్ని పరిశీలిస్తున్నది.

  1. ఒక డిప్యూటీ సీఎం పోస్టుతోపాటు 13 మంత్రి పదవులు.

2. ఫడ్నవీస్ కేబినెట్​లో చేరనట్లయితే కేంద్ర కేబినెట్​లో సేనకు అదనంగా రెండు కేబినెట్​ ర్యాంకు బెర్తులు.