
భక్తులకు గుట్ట మీద నిలువ నీడ లేదు.. తాగేందుకు నీళ్లు లేవు
గుట్ట కిందే తలనీలాలు, స్నానాలు, టికెట్లు.. వీటిలో ఏది మరిచినా మళ్లా కిందికి రావాల్సిందే
సమాచారం ఇచ్చే దిక్కు లేదు.. సూచిక బోర్డులూ లేవు
కల్యాణకట్ట, క్యూ కాంప్లెక్స్లో తప్ప ఎక్కడా కనిపించని టాయిలెట్లు
వీఐపీ బ్రేక్ దర్శనం రూల్స్ అమలైతలే
యాదాద్రి, వెలుగు: పైన ఎర్రటి ఎండ.. కింద కాలుతున్న బండ.. నిలబడడానికి నీడ కూడా లేదు. గొంతు తడారి పోతున్నా.. తాగడానికి చుక్క నీరు లేదు. రూ. 1,200 కోట్లతో పునర్నిర్మించి ప్రారంభించిన యాదగిరిగుట్టపైన భక్తుల తిప్పలివి. దాదాపు ఆరేండ్ల తర్వాత యాదాద్రిని అన్ని హంగులతో ప్రారంభించామని రాష్ట్ర సర్కారు చెబుతున్నా భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెప్పే బోర్డులన్నా ఏర్పాటు చేయలేదు. కొండపైన, కొండకింద షాపులు లేకపోవడంతో పూజా సామగ్రి ఎక్కడ కొనాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
కొండ కింద కష్టాలు ఇలా..
గతంలో ధర్మపుష్కరిణి, కల్యాణకట్ట గుట్ట మీద ఉండేవి. దీంతో భక్తులు నేరుగా గుట్టపైకి వెళ్లి అక్కడే తలనీలాలు సమర్పించి, పుణ్యస్నానాలు చేసి దైవదర్శనం చేసుకునేవాళ్లు. కానీ పునర్నిర్మాణంలో భాగంగా వాటిని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్ట కింద ఏర్పాటుచేశారు. ఇవి బస్టాండ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రెసిడెన్షియల్సూట్ ఎదురుగా ఉన్నాయి. అంటే భక్తులు బస్స్టేషన్లో బస్సు దిగాక ఆటోలో కల్యాణకట్ట చేరుకొని అక్కడ తలనీలాలు సమర్పించి, లక్ష్మీపుష్కరిణిలో స్నానం చేశాక తడి బట్టలతో మళ్లీ ఓ ఆటో పట్టుకొని బస్స్టేషన్ చేరి, అక్కడి నుంచి మినీ బస్సులో కొండపైకి చేరుకుంటే తప్ప దర్శనభాగ్యం కలగదు. లక్ష్మీపుష్కరిణిలో సరిపడా నీరు లేకపోవడంతో స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మారిన రూల్స్ ప్రకారం కొండపైకి నేరుగా వెళ్తే ధర్మ దర్శనం కల్పించడం లేదు. పుష్కరిణి వద్ద ఏర్పాటుచేసిన టికెట్కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో తలనీలాలు సమర్పించినా, సమర్పించకున్నా భక్తులు ఈ టికెట్ కోసమైనా బస్స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రావాల్సి వస్తున్నది.
కొండ మీద కష్టాలు ఇట్లా..
అసలే ఎండాకాలం.. సూర్యుడు మండిపోతుంటే.. కొండ కాలిపోతున్నది. నిలబడడానికి ఎక్కడా తగినంత నీడ కూడా లేదు. కనీసం చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల కాళ్లు కాలిపోతున్నాయి. ఇక తాగడానికి నీళ్ల సౌలత్కూడా లేదు. వాటర్ బాటిల్ కొందామన్నా షాపులు కనిపించవు. క్యూ కాంప్లెక్స్లో ఉన్నవారు బయటి గాలి రాక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్లు దాటుకుని స్వామి వారి దర్శనం చేసుకున్నాక ప్రసాద విక్రయశాల వరకు సుమారు 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తున్నది. భక్తులు ఎక్కువగా వచ్చే శుక్ర, శని, ఆదివారాలతో పాటు, ప్రభుత్వ సెలవు దినాల్లో వారి బాధలైతే చెప్పరాకుండా ఉన్నాయి. సొంత వెహికల్స్కు పర్మిషన్ లేకపోవడంతో కొండ మీదికి దేవస్థానం ఏర్పాటు చేసిన మినీ బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తున్నది. కొండ కింద కూడా ఎలాంటి నీడ లేకపోవడంతో ఎర్రటి ఎండలో పిల్లలతో కలిసి బస్సులు వచ్చే వరకు ఎదురుచూడాల్సి వస్తున్నది. 20 మంది కెపాసిటీ ఉన్న బస్సుల్లో 30 నుంచి 40 మందిని కుక్కి తీసుకెళ్తున్నారు. కిందే టికెట్తీసుకోవాలన్న విషయం తెలియని భక్తులు కొండపైకి వెళ్లి తిరిగి మళ్లీ పుష్కరిణి దగ్గరకు వచ్చి టికెట్ తీసుకొని వెళ్తున్నారు.
బ్రేక్ దర్శనం రూల్స్ గాలికి..
యాదగిరిగుట్ట దేవస్థానం తెచ్చిన రూల్స్ సామాన్య భక్తులకు మాత్రమే అమలు చేస్తున్నారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సెలవు రోజుల్లో వీఐపీలకు బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు. ఈ నిలిపివేత ఆర్డర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎప్పటిలాగే వీఐపీలకు బ్రేక్ దర్శనాలను కొనసాగిస్తున్నారు. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలోకి సెల్ఫోన్లు నిషేధించారు. ఈ నిషేధం సామాన్య భక్తులకు మాత్రమే అమలు చేస్తున్నారు. వీఐపీలు, ఆలయ సిబ్బంది సన్నిహితులు సెల్ఫోన్లతోనే దర్శనానికి వెళ్తున్నారు. టెంపుల్లో సెల్ఫీలు దిగుతూ సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొండపైకి వెహికల్స్ను నిషేధించినా రాజకీయనాయకులు, ఉద్యోగుల సన్నిహితులు మాత్రం యథేచ్ఛగా వెహికల్స్ తీసుకెళ్తున్నారు. దీంతో రూల్స్ తమ లాంటి సామాన్యులకేనా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఒంటికి, రెంటికి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు పోవాలె
కొండ కింద కల్యాణకట్ట ప్రదేశంలో, కొండపైన క్యూ కాంప్లెక్స్లో మాత్రమే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రదేశాల్లోనే ఒంటికి, రెంటికి వెళ్లాలి. కల్యాణకట్ట నుంచి కొండ మీదికి వెళ్లాలంటే దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడా సులభ్కాంప్లెక్స్లు నిర్మించకపోవడంతో పిల్లలు, వృద్ధులు, షుగర్ పేషెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది.
రెండు మూడు సార్లు పైకి కిందికి..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శారద, నాగయ్య చారి ఇటీవల యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. నేరుగా బస్సులో కొండపైకి వెళ్లారు. అక్కడ స్నానం చేయడానికి పుష్కరిణి లేకపోవడంతో తిరిగి కిందికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి మళ్లీ కొండపైకి వెళ్లారు. తీరా టికెట్ తీసుకోవాలని చెప్పడంతో మరోసారి కొండకిందికి వచ్చి టికెట్కొని కొండపైకి ఎక్కి దర్శనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించే బోర్డులు కూడా లేకపోవడం, సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో రెండుమూడుసార్లు ఎక్కి దిగాల్సి వచ్చిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.