కొమురవెల్లి మల్లన్నఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లన్నఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి  ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం స్నానమాచరించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 

మల్లన్న ఆలయానికి విరాళం అందజేత

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న 100 గదుల నిర్మాణంలో ఓ గది నిర్మాణానికి హైదరబాద్ కు చెందిన డాక్టర్ రామన్ దేవిక దంపతులు రూ.15 లక్షలు విరాళంగా అందించారు.  కార్యక్రమంలో ఈవో అన్నపూర్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, అర్చకులు అంజనేయులు పాల్గొన్నారు.