
పండగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. గుడికి వెళ్లినా... ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించేందుకు వెళ్లినా.. స్వామివారికి నివేదనగా భక్తులు కొబ్బరికాయను తీసుకెళ్లారు. కొబ్బరికాయ కొట్టే ముందు పీచు మొత్తం తీసి.. పైన పిలకను (జుట్టు) ఉంచుతారు. కొట్టిన తరువాత ఆ పీచును తొలగించి స్వామికి నివేదిస్తారు. అలా జుట్టులేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతారు .. దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా? పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా? మొదలగు విషయాలు తెలుసుకుందాం. . .
దేవుడిని స్మరించేందుకు తెలిపిన తొమ్మిది రకాల భక్తి మార్గాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో చివరిది ఆత్మను భగవంతునికి నివేదన చేయడం.. ఆత్మను ఎలా నివేదించాలి అనే విషయాన్ని పరమేశ్వరుడు.. గణపతికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
మనిషి ఆత్మను కొబ్బరికాయ రూపంలో భగవంతునికి సమర్పించవచ్చని పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామికి కొబ్బరికాయను సమర్పిస్తే... ఆత్మను సమర్పించినట్లే నని పండితులు చెబుతున్నారు. పిలకలేని కొబ్బరికాను భగవంతునికి సమర్పిస్తే.. ఎందుకు ఇస్తున్నామో.. దాని ఫలితం ఉండదు.. పైగా అరిష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే పూజ చేసిన తరువాత చివరిలో నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టి ఆ రెండు చక్కలను స్వామికి మంత్రపూర్వకంగా నివేదిస్తారు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం।
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం॥
కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక... ఎలాగంటే...
- కాయ పైనుండే పొర.. చర్మం.
- కొబ్బరి పీచు ... శరీరంలోని మాంసం..దృఢంగా ఉండే చిప్ప ఎముకలు
- తెల్లగా ఉండే కొబ్బరి ... మనిషిలోని ధాతువు
- కొబ్బరికాయలోని నీళ్లు... ప్రాణాధారం... ( అందుకే చాలామంది డాక్టర్లు కొబ్బరి నీళ్లు తాగమని చెబుతుంటారు)
- కొబ్బరి కాయకు ఉండే మూడు కన్నులు... ఇడ, పింగళ, సుషుమ్న నాడులు.
- కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టేముందు పైన ఉండే జుట్టు(పిలక): అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక .. అందుకే కొట్టిన తరువాత ఆ పిలకను తొలగిస్తారు.
అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి. పిలక లేని కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టకూడదు. ఎందుకంటే పరమశివుడు త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు గణపతిని పూజించి.... అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే పూజల్లో... వ్రతాల్లో.. నోముల్లో.. కలశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు.. కొబ్బరికాయకు పిలక ఉండేలా ఉంచి.. దానిపై జాకెట్ ముక్కను అలంకరించి.. పసుపు.. కుంకుమలతో పూజిస్తారు. ఆ కొబ్బరికాయను పూజ చేసే భగవంతుడిని ఆవాహన చేసి మడపం మధ్యలో ప్రతిష్టిస్తారు. చుట్టూ నవగ్రహాలను ఆరాధించి మండపారాధన చేస్తారు. అంటే మన ఆత్మను పూజించి.. స్వామికి అర్పణం చేస్తున్నామనే భావనతో శ్రద్దగా.. ఆధ్యాత్మిక చింతనతో పూజ చేయాలని చెబుతున్నారు.