భారత్‎లోని అన్ని బోయింగ్ విమానాలు తనిఖీ చేయండి: DGCA ఆదేశం

భారత్‎లోని అన్ని బోయింగ్ విమానాలు తనిఖీ చేయండి: DGCA ఆదేశం

న్యూఢిల్లీ: అహ్మబాదాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 300 మంది చావుకు కారణమైన బోయింగ్ విమానాల భద్రతపై తనిఖీలకు ఆదేశించింది. అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

డీజీసీఏ ఆదేశాలతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ చర్యలు ప్రారంభించింది. తమ దగ్గర ఉన్న బోయింగ్ విమానాలను ఆడిట్ చేస్తోంది. అన్ని 787 సిరీస్ బోయింగ్ విమానాల భద్రత ప్రమాణాలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. అనంతరం రిపోర్టును డీజీఏసీకు అందజేయనుంది ఎయిర్ ఇండియా. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 26 బోయింగ్ 787-8, 7 బోయింగ్ 787-9 విమానాలు నడుపుతోంది. డీజీసీఏ ఆదేశాల మేరకు ఈ అన్ని విమానాల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి డీజీసీఏకు రిపోర్టు ఇవ్వనుంది. 
ALSO READ | Ahmedabad Air India plane crash :బ్లాక్ బాక్స్ దొరికింది.. ఇదే ప్రమాదానికి కారణం తెలిపే కీలక ఆధారం

గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. 

ఈ ప్రమాదంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం బోయింగ్ 787-8గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు 300 మంది చనిపోవడంతో బోయింగ్ విమానాల భద్రత ప్రమాణాలపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదాలకు కేరాఫ్‎గా మారుతోన్న బోయింగ్ విమానాల భద్రతపై నివేదిక అందజేయాలని డీజీసీఏ ఎయిర్ లైన్స్ సంస్థలను ఆదేశించింది.