
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం(జూన్13) అహ్మదాబాద్లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ దొరికింది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై దర్యాప్తులో పాల్గొన్న ATSఅధికారులకు బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇదే విమాన ప్రమదానికి కారణం తెలిపే కీలక ఆధారం కానుంది.
ఇంతకుముందు కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానశకలాలనుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ కూలిపోయిన బీజే ఆస్పత్రి సమపీంలో దర్యాప్తులో పాల్గొన్న ATS అధికారి డీవీఆర్ ను కనుగొన్నారు. బ్లాక్ బాక్సు, డీవీఆర్ లభ్యం కావడంతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.
ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకం. పైలట్ల సమాచారం, విమానం టెక్నికల్ సమాచారం అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు కావడంతో తదుపరి దర్యాప్తులో బ్లాక్ బాక్సుల పాత్ర కీలకంగా మారింది.
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297 కు పెరిగింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతిచెందగా.. ఈ విషాదం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న 56 మంది మృతిచెందారు.
►ALSO READ | Plane Crash: విమాన ప్రమాదంతో షాక్ అయ్యా.. ప్రమాదం మా ఇంటి దగ్గర్లోనే జరిగిందన్న నటుడు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని శుక్రవారం ప్రధాని మోదీ సందర్శించారు. మేఘని నగర్ లో ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలు అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. హోంమంత్రి అమిత్ షా కూడా గురువారం సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు.
మరోవైపు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది.