హైదరాబాద్, వెలుగు: అత్యాధునిక టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రూ.వేల కోట్లు కొట్టేస్తున్నారని డీజీపీ జితేందర్ చెప్పారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ ముందున్నదని తెలిపారు. దాదాపు రూ.150 కోట్ల వరకు నగదును ఫ్రీజ్ చేయించి బాధితులకు అందించామని వెల్లడించారు.
సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ యాప్సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోయిన బాధితులకు సొమ్ము రీఫండ్ ఆర్డర్లను అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. వ్యవస్థల్లోని సైబర్ భద్రత లోపాలను గుర్తిస్తే వాటిని నివారించే అవకాశం ఉంటుందన్నారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో విద్యావంతులే 70 శాతం ఉంటున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. హ్యాకథాన్లో 20 దేశాలకు పైగా 10 వేల మంది పాల్గొంటున్నట్టు వెల్లడించారు. ఈ నెల 22న హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐదుగురు చొప్పున విజేతలుగా ప్రకటిస్తామన్నారు. వీరికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో నిమిషానికి రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. గతేడాది సైబర్ క్రైమ్స్ వల్ల దేశంలో రూ.7,500 కోట్లు కోల్పోయారని వెల్లడించారు.
