ధర్మసాగర్(వేలేరు), వెలుగు: లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, సమాచారం తెలిస్తే 63000 30940 నంబర్లో తెలియజేయాలని డీఎంహెచ్ వో అప్పయ్య కోరారు. మంగళవారం వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 5,159 మంది టీబీ సోకే అవకాశం ఉన్నవారిని స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా కేవలం 2,749 మందిని పరీక్షించారని తెలిపారు.
మిగతా వారికి త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యంపై దృష్టిసారించాలన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించే షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్లు నవీన్, వైశాలి, హెచ్ఈవో వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు , ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
