ఆరో బౌలర్ కోసమే రెండో వన్డేలో సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోలేదని టీమిండియా వన్డే కెప్టెన్ శిఖర ధావన్ తెలిపాడు. తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే సంజూ శాంసన్ను పక్కనపెట్టాల్సి వచ్చిందని ధావన్ చెప్పుకొచ్చాడు.
అందుకే సంజూను పక్కన పెట్టాం..
ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉందని ధావన్ చెప్పాడు. శుభ్ మన్ బాగా ఆడాడని కొనియాడాడు. వర్షం వల్ల పిచ్ కాస్త సీమింగ్ ఉంటుందని అనుకున్నట్లు తెలిపాడు. కానీ గత మ్యాచ్ పిచ్లా ఈ పిచ్ లేదన్నాడు. అయితే మ్యాచ్ పరిస్థితి తగ్గట్లు ఆరో బౌలర్ కావాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే సంజూ స్థానంలో దీపక్ హుడాను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వివరించాడు. అటు బంతిని స్వింగ్ చేయగలడనే దీపక్ చాహర్ను ఎంచుకున్నట్లు వెల్లడించాడు.
కుర్రాళ్లకు మంచి ఛాన్స్
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కుర్రాళ్లకు మంచి అవకాశం అని ధావన్ అన్నాడు. శుభ్ మన్ బ్యాటింగ్, ఉమ్రాన్ బౌలింగ్ చూస్తే అర్థమవుతుందన్నాడు. వీరే కాకుండా ఇతర ప్లేయర్లు బాగా ఆడుతున్నారని కొనియాడాడు. యువ జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నాడు. తొలి వన్డేలో ఓడటం నిరాశకు గురి చేసిందన్నాడు. రెండో వన్డేలో అయినా గెలవాలనుకున్నా..వాన తమకు అడ్డుపడిందన్నాడు. చివరి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.