అంటాల్యా (టర్కీ): ఇండియా స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర.. వరల్డ్ కప్ స్టేజ్–3లో ‘గోల్డెన్ డబుల్’ సాధించాడు. మిక్స్డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ మోహోద్తో కలిసి స్వర్ణం గెలిచిన కొన్ని గంటల వ్యవధిలోనే మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలోనూ పసిడిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ధీరజ్–కుంకుమ్ మోహోద్ 5–1తో ఒలింపిక్ చాంపియన్స్ కిమ్ జెడయోక్–ఓ యో జిన్ (సౌత్ కొరియా)పై సంచలన విజయం సాధించారు. తొలిసెట్లో కొరియా ఆర్చర్ తొలి బాణంతోనే నిరాశపర్చగా, ఇండియా ద్వయం మాత్రం స్థిరంగా ఆడింది.
కుంకుమ్ సూపర్ గురితో 10 పాయింట్లు రాబట్టడంతో స్కోరు 37–36గా మారింది. దాంతో ఇండియా 2–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో సెట్లో కొరియా విలుకాండ్లు 36 పాయింట్లు సాధించగా, చివరి బాణానికి ఇండియాకు 10 పాయింట్లు అవసరమయ్యాయి. ధీరజ్ 10 పాయింట్లు నెగ్గడంతో 37–36తో సెట్ను గెలిచి ఆధిక్యాన్ని 4–0కు పెంచారు. మూడో సెట్లో కొరియా ద్వయం రెండు 10లతో 39 పాయింట్లు గెలిచింది. ఒత్తిడిలో పడిన కుంకుమ్ 10 పాయింట్లు నెగ్గగా, ధీరజ్ కూడా 10 పాయింట్లు సాధించడంతో సెట్ 39–39తో డ్రా అయ్యింది. దాంతో ఇండియా నిర్ణయాత్మక పాయింట్తో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ 7–3తో లీ వూ సీక్ (సౌత్ కొరియా)కు షాకిచ్చాడు. ధీరజ్ కెరీర్లో ఇదే తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ గోల్డ్ కావడం విశేషం.
