కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫేస్ మాస్క్లు తప్పనిసరి కావడంతో విక్రయదారులు రకారకాలు మోడల్స్ లో మాస్కులను తయారుచేస్తున్నారు. వినియోగదారులు కూడా వినూత్నంగా తయారుచేసిన మాస్కులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్తగా మాస్కులను తయారుచేయాలని సూరత్లోని ఒక నగల దుకాణ యజమాని దీపక్ చోక్సీకి ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తి తన షాపుకు వచ్చి డైమండ్ మరియు బంగారంతో వధూవరుల కోసం ప్రత్యేకమైన మాస్కులు చేయాలని కోరాడు. దాంతో ఇదేదో బాగుందే అనే ఆలోచన వచ్చిందని చోక్సి తెలిపాడు. అందుకే రూ .1.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య డైమండ్ తో చేసిన మాస్కులను తయారు చేయాలనుకున్నట్లు ఆయన తెలిపారు.
దీపక్ చోక్సీ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక కస్టమర్ మా దుకాణానికి వచ్చి వధూవరులకు ప్రత్యేకమైన మాస్కులు కావాలని డిమాండ్ చేశాడు. దాంతో డైమండ్ లతో మాస్క్లను తయారుచేయించాం. వాటిని చూసిన కస్టమర్ అవి నచ్చడంతో కొనుగోలు చేశాడు. కొత్తగా అనుకరించాలనుకునేవాళ్లు రాబోయే రోజుల్లో ఇలాంటి మాస్కులను అడుగుతారని భావించి మరికొన్నింటిని తయారుచేశాం. వీటిని తయారు చేయడానికి స్వచ్ఛమైన వజ్రాలు మరియు అమెరికన్ వజ్రాలు బంగారంతో ఉపయోగించబడ్డాయి. అమెరికన్ వజ్రాలతో పాటు పసుపు బంగారం కూడా ఉపయోగించిన మాస్కు ధర 1.5 లక్షలు. తెలుపు బంగారం మరియు నిజమైన వజ్రాలతో తయారు చేయబడిన మరో మాస్కు ధర రూ .4 లక్షలు’ అని ఆయన తెలిపారు.
ఈ మాస్కుల తయారీకి ఉపయోగించిన క్లాత్.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని దుకాణ యజమాని తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకు ఈ మాస్కులలో ఉపయోగించిన వజ్రాలు మరియు బంగారాన్ని బయటకు తీసి.. వాటితో మరో కొత్త ఆభరణాలను తయారుచేసుకోవచ్చని ఆయన తెలిపారు.
డైమండ్ మాస్కు కొనుగోలు చేసిన దేవాన్షి అనే కస్టమర్ మాట్లాడుతూ..నేను మా ఇంట్లో పెళ్లి ఉండటంతో నగలు కొనడానికి షాపుకు వచ్చాను. ఇక్కడ నాకు నగల కంటే.. డైమండ్ మాస్క్లు ఆకర్షణీయంగా కనిపించాయి. దాంతో నా డ్రస్ కు మ్యాచ్ అయ్యే మాస్కులను కొన్నాను’అని తెలిపింది. ఇటీవల పూణేలోని శంకర్ కురాడే అనే వ్యక్తి కూడా రూ 2.89 లక్షల రూపాయల విలువైన బంగారంతో మాస్క్ తయారు చేయించుకున్నాడు.
For More News..