అమృత్ సర్: పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జైషే ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో మృతుల విషయంలో ప్రతిపక్ష నేతల అనుమానాలు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ ఈ విషయంలో గొంతు కలిపారు. ఎయిర్ స్ట్రైక్ రాజకీయాల కోసం చేసినదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారాయన. ఆర్మీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడొద్దని సూచించారు. 300 మంది ఉగ్రవాదులు మరణించింది నిజమా? కాదా? చెప్పాలన్నారు. ‘కాదంటే ఎయిర్ స్ట్రైక్ ఉద్దేశమేంటి? ఆ దాడి చేసింది ఉగ్రవాదులను అంతం చేయడానికా? చెట్లను పెకలించడానికా? ఎయిర్ స్ట్రైక్ ఒక రాజకీయ జిమ్మిక్కా?’ అని సిద్దూ ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా దేశాన్ని యుద్ధం ముంగిట్లోకి నెడుతున్నారని, ఆర్మీని కూడా రాజకీయ అవసరాలకు వాడుకోవడం ఆపాలని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు బీజేపీ నేత కామెంట్లకు సంబంధించిన వార్త క్లిప్పింగ్ లను సిద్దూ జోడించారు. వాటిలో ఎయిర్ స్ట్రైక్ ఉద్దేశం పాకిస్థాన్ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపడమే కానీ, ఎవరినీ చంపడం కాదని కేంద్ర మంత్రి ఎస్ఎస్ అహువాలియా వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఒకటి. అలాగే కర్ణాటకలో 28 ఎంపీ సీట్లలో 22 బీజేపీనే గెలిచేందుకు ఎయిర్ స్ట్రైక్ ఉపయోపడుతుందని యడ్యూరప్ప అన్న కామెంట్స్ కూడా సిద్దూ పోస్ట్ చేశారు.