సిరిసిల్లలో ఉపాధి తంట.. గుండు గీస్తే గుర్తుపట్టని యాప్.. తలపై సీట్ కవర్ కప్పి అటెండెన్స్ వేయించుకున్న కూలీలు

సిరిసిల్లలో ఉపాధి తంట.. గుండు గీస్తే గుర్తుపట్టని యాప్.. తలపై సీట్ కవర్ కప్పి అటెండెన్స్ వేయించుకున్న కూలీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు ఓ విచిత్ర సమస్య ఎదురైంది. వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించి గుండు చేయించుకున్న కూలీలను బయోమెట్రిక్ యాప్ గుర్తించకపోవడంతో పనులకు హాజరు నమోదు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన నలుగురు ఉపాధి హామీ కూలీలు ఇటీవల వేములవాడ రాజన్న స్వామికి మొక్కు చెల్లించి గుండు చేయించుకున్నారు.
అయితే ఉపాధి హామీ పనులకు హాజరు నమోదు చేసే సమయంలో ముఖ గుర్తింపు ఆధారంగా పనిచేసే యాప్ వారిని గుర్తించలేకపోయింది. దీంతో హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

యాప్ తమ ముఖాలను గుర్తించేందుకు తలపై సీట్ కవర్ కప్పి, పాత ఫోటోకు దగ్గరగా కనిపించేలా ప్రయత్నించగా యాప్ గుర్తించి హాజరు నమోదైనట్లు చూపించింది. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేయగా, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుండు చేయించుకోవడం, స్వల్ప మార్పులు రావడం వంటి కారణాలతో కూలీల హాజరు నమోదు కాకపోవడం సరికాదని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యాప్ సులభంగా గుర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.