సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈసారి కూడా..

సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈసారి కూడా..

సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. మంగళవారం ( మే 13 ) సీబీఎస్సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాన్యం భరద్వాజ్ ఫలితాలను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది 88.39 శాతం మంది అభ్యర్థులు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని.. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 87.98 శాతం కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగిందని తెలిపారు భరద్వాజ్. ఎప్పటిలాగే ఈసారి కూడా సీబీఎస్సీ ఫలితాలలో బాలికలదే పైచేయి కావడం గమనార్హం.

బాలికలు 91.64 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 85.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు గత సంవత్సరం 50 శాతంతో పోలిస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. పరీక్షకు హాజరైన 16,92,794 మందిలో 1,11,544 మంది అభ్యర్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా, 24,867 మంది అభ్యర్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు.1.29 లక్షలకు పైగా అభ్యర్థులను కంపార్ట్‌మెంట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా 7 వేల 842 సెంటర్లలో పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. 10, 12వ తరగతుల పరీక్షలకు ఈ ఏడాది సుమారు 42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో పాటు 26 దేశాల్లో కూడా పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. ఓవరాల్ గా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 24.12 లక్షల మంది హాజరు కాగా.. 12వ తరగతి పరీక్షలకు 17.88 లక్షల మంది హాజరయ్యారు.

ఫలితాల కోసం https://cbseresults.nic.in/ క్లిక్ చేయండి