కోలీవుడ్ స్టార్, యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యూచరిస్టిక్ రోమ్-కామ్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టి సినిమాపై కంటే, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపైనే ఎక్కువగా పడటం విశేషం.
హీరోగా అనిల్ రావిపూడి?
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ రావిపూడి ఎనర్జీ మామూలుగా ఉండదు. తను చూడ్డానికి అచ్చం హీరోలా ఉంటాడు. ఇప్పటికే తన సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో మెరిశాడు. సరైన కథ కుదిరితే అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం చేసే బాధ్యత నాది అని దిల్ రాజు అన్నారు. దీంతో అభిమానుల ఈలలు, గోలలతో ఆడిటోరియం హోరెత్తిపోయింది.
దీనికి అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందిస్తూ.. ఉండండ్రా బాబు.. ప్లీజ్.. నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను దర్శకుడిగా నా పని నేను చేసుకుంటున్నాను అంటూ నవ్వులు పూయించారు. అయినప్పటికీ, దిల్ రాజు గారి ఆఫర్ గొప్పదని, కానీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా దర్శకత్వం పైనే ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో కుదిరితే ప్రదీప్ రంగనాథన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని అనిల్ వెల్లడించారు.
►ALSO READ | Zayn Marie Khan: బోల్డ్ లుక్తో సెన్సేషన్.. ఒక్క ఈవెంట్ తోనే ఇంటర్నెట్ షేక్.. ఎవరీ వైరల్ బ్యూటీ?
ప్రదీప్ పై ప్రశంసలు
ప్రదీప్ రంగనాథన్ నటన చాలా నేచురల్గా ఉంటుందని అనిల్ అన్నారు. అతను మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు, అందుకే ‘లవ్ టుడే’ అంత పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్యతో అతని కాంబినేషన్ థియేటర్లలో పేలిపోతుంది అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా నటించిందని ప్రశంసించారు.
డబ్బింగ్ పై నిజాయితీ
ఈ ఈవెంట్లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని పంచుకున్నారు. మొదట ఈ సినిమాకు తనే డబ్బింగ్ చెప్పుకున్నానని, కానీ అది ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తెలుగు ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ మేరకు డబ్బింగ్ ఆర్టిస్ట్ను మార్చినట్లు నిజాయితీగా ఒప్పుకున్నారు. ప్రేక్షకుల సంతృప్తి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, ఒక వినూత్నమైన అప్లికేషన్ బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
