హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ఈ మధ్య రాష్ట్రంలోని కొంతమంది ఉన్నతాధికారులకు పరిపాటిగా మారింది. గతంలో కలెక్టర్లు కేసీఆర్ కాళ్లు మొక్కి స్వామి భక్తి చాటుకున్నారు. గతంలో సిద్దిపేట కలెక్టర్గా పని చేసిన వెంకట్రామిరెడ్డి, మరో జిల్లా కలెక్టర్ కూడా కేసీఆర్ కాళ్లు మొక్కారు. తాజాగా వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కారు. ప్రగతిభవన్లో పదే పదే శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు మొక్కడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసుల్ని కూడా కేసీఆర్ వర్చువల్గానే ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ను కలిసిన శ్రీనివాసరావు.. పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళ్లు మొక్కారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా కూడా మరోసారి కాళ్ల మీద పడ్డారు.
వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు మొక్కడం చూసిన కొందరు అధికారులు అవాక్కవుతున్నారు. ఏదో ఆశించి శ్రీనివాస్ రావు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారని..అందుకే కాళ్లు మొక్కారనే ప్రచారం జరుగుతోంది.