
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట సినిమా గురించి విశేషాలను తెలియజేశారు.
ఆ ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది..
"2018లో ‘బింబిసార’ జర్నీ ప్రారంభమైంది. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది. కథంతా ఓ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ‘మిమ్మల్ని ఓసారి కలవాలని అనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ పంపాను. పటాస్ సినిమా నుంచి ఆయతనో ట్రావెల్ ఉంది. మెసేజ్ చూసుకున్న ఆయన కలిశారు. నేను చెప్పిన పాయింట్ బాగా నచ్చేసింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరికి కథ నెరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. తర్వాత సినిమా ఎలా ముందుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే.
ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను..
తొలి సినిమాను డైరెక్ట్ చేసినా నా సబ్జెక్ట్పై నమ్మకం. దాన్నే కళ్యాణ్ రామ్, హరి నమ్మారు. బింబిసార వంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటా, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. నాకు ముందు నుంచి డైరెక్షన్ అంటేనే ఇష్టం. అయితే మధ్యలో ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. చివరకు నాకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవటం ఉత్తమం అనిపించింది. దాంతో మళ్లీ దర్శకత్వ శాఖ వైపు అడుగు లేశాను.
ప్రతి రోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది..
బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓరకంగా చెప్పాలంటే నేను ప్రతి రోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు నాకు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం. మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ.
ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్తో బిజీగా..
బింబిసార సినిమా అనుకోగానే కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నాం. అయితే అప్పటికే ఆయన ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన్ని అప్రోచ్ కూడా కాలేదు. అప్పుడు చిరంతన్ భట్ ని అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఆయన ఈ టైప్ ఆఫ్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణిని చేసున్నారు. ఆయన్ని కలిసి కథ చెప్పిన తర్వాత కర్మ సాంగ్ను ఇచ్చారు. తర్వాత మరో సాంగ్ను ఇచ్చారు. మూడో సాంగ్ను వరికుప్పల యాదగిరి ఇచ్చారు. ఫోక్ సాంగ్ కావాలి. కానీ.. రొటీన్ ఫోక్ కాకూడదనిపించి.. వరికుప్పల యాదగిరికి విషయం చెబితే ఆయనే ట్యూన్ కంపోజ్ చేశారు. తర్వాత టీజర్కి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. తర్వాత ఆయన బిజీగా ఉండటంతో కీరవాణిని కలిశాం. ఆయన సినిమా చూసి ఏమంటారోనని కాస్త ఆలోచించాం. కానీ ఆయన సినిమా చూసి వర్క్ చేస్తానని చెప్పారు.
దీంతో సినిమాకు సమయం పట్టింది..
సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు రాజుల పాత్రల్లో మనల్ని అలరించారు. వారికి దగ్గర పోలికల్లో మన సినిమాలో హీరో లుక్ ఉండకూడదని అనిపించింది. ఆ సమయంలో మా డిజైనర్ రాము కొన్ని స్కెచెస్ ఇచ్చారు. అందులో ఇప్పటి లుక్ అందరికీ నచ్చింది. గత ఏడాది సెప్టెంబర్కే షూటింగ్ పూర్తయ్యింది. అయితే సినిమాలో సీజీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీంతో సినిమాకు సమయం పట్టింది. బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. కాబట్టి రెండు భాగాలు చేయాలని అనుకుంటున్నాం. స్క్రిప్టింగ్ టైమ్లోనే ఈ ఆలోచన ఉంది. నెక్ట్స్ బింబిసారుడు 2 ఉంటుంది. బింబిసారుడు అనే క్యారెక్టర్ ఓ సూపర్ మ్యాన్లాంటి క్యారెక్టర్ దీన్ని 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చు" అని దర్శకుడు వశిష్ట అన్నారు.