దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య సోమవారం మృతి చెందాడు. డిసెంబర్ 26న నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్పై వెళ్తున్న ఆయన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు విరిగిపోవడంతో కొన్ని రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండి చికిత్స పొందాడు. పరిస్థితి మెరుగుపడటంతో కొద్దిరోజుల క్రితమే కుటుంబసభ్యులు ఆయన్ని స్వగ్రామమైన నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అనారోగ్యానికి గురై.. కురుమయ్య ఇంట్లోనే మృతి చెందాడు. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. చెన్నకేశవులు భార్య రేణుక నాలుగు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.