
- విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని చర్చ
- అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని సభ్యుల ఆగ్రహం
- హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జిల్లా ఉన్నతాధికారులు
- ముగ్గురు ఎమ్మెల్యేలు గౌర్హాజర్
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో ఎంపీ సురేశ్షెట్కార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మీటింగ్ రసాభాసగా మారింది. పలు అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనులు తగ్గించొద్దని తీర్మానాలు చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఎఫ్వో నిఖిత, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, దిశ కమిటీ మెంబర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలను తగ్గించొద్దన్నారు.
విద్య, వైద్యం, అమృత్ స్కీమ్ కింద కామారెడ్డిలో చేపడుతున్న తాగునీటి పథకాలు, హైవే అంశాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వనిధులతో చేపడుతున్న పనులపై రివ్యూ చేశారు. జిల్లాలో గత ఆర్థిక ఏడాదిలో ఉపాధి హామీ కింద 43 లక్షల పని దినాలు కల్పించారని, ఈసారి పనిదినాలు 23 లక్షలకు టార్గెట్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సీసీ రోడ్లు, పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల బిల్డింగ్ల నిర్మాణ పనులపై ప్రభావం చూపుతుందన్నారు. ఉపాధి హామీపని దినాల సంఖ్య 50 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ పంపాలని దిశ మీటింగ్లో
తీర్మానించారు.
టీచర్లు వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం..
ప్రభుత్వ స్కూల్స్పై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని దిశ కమిటీ మెంబర్లు పేర్కొన్నారు. టీచర్లు రెగ్యులర్గా స్కూల్స్కు వస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతందన్నారు. ఎల్లారెడ్డి మండలం హాజిపూర్ తండాలో నలుగురు విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉన్నారని మెంబర్ రాజు పేర్కొన్నారు. చాలా చోట్ల టీచర్లు స్కూల్కు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయి సొంత బిజినెస్లు చూసుకుంటున్నారన్నారు. డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు టీచర్లను పంపిస్తే ఇక్కడి విద్యార్థులకు బోధన ఎలా అని ప్రశ్నించారు.
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు టీచర్లను ఇతర జిల్లాలకు డిప్యూటేషన్పై పంపినట్లు డీఈవో రాజు తెలిపారు. ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా టీచర్లను డిప్యూటేషన్పై పంపవద్దని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీలు చేయట్లే..
ప్రైవేట్ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్నారని దీనిపై వైద్య శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకొవట్లేదని సభ్యులు ప్రశ్నించారు. 25 ఏండ్లు నిండిన మహిళలకే గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేస్తున్నారని, ఇది మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ డోస్ మందులు రాస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో చంద్రశేఖర్ పేర్కొన్నారు.
మెదక్నుంచి ఎల్లారెడ్డి మీదుగా రుద్రూర్ వరకు చేపట్టిన హైవే పనుల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కారు బోల్తా పడి ఇద్దరు చనిపోయారని తెలిపారు. హైవే 44పై బీటీఎస్ దగ్గర అండర్ ఫాస్ బ్రిడ్జి చిన్నగా ఉండటంతో దోమకొండ, బీబీపేట మండలాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వెహికల్స్ 5 కి.మీ. దూరం వెళ్లి యూ టర్న్ తీసుకొని రావాల్సి వస్తుందని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. త్వరలో 6 లైన్ల నిర్మాణానికి డీపీఆర్ రెడీ అవుతుందని అప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్ చేయనున్నట్లు పీడీ శ్రీనివాస్ చెప్పారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సప్లయ్ కోసం అమృత్ స్కీమ్ కింద రూ. 93 కోట్లతో పనులు చేపడుతున్నప్పటికీ ఎస్సారెస్పీ నుంచి మెయిన్ పైపులైన్ ప్రత్యేకంగా వేయకుండా పనులు చేపట్టడంపై ఎంపీ సంబంధిత అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైపులైన్ నుంచి ఇవ్వటం వల్ల జిల్లా కేంద్రంలో నీటి సప్లయ్కు ఇబ్బందులు కలుగుతాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఎంపీ పేర్కొన్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు..
దిశ మీటింగ్కు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు వెంకటరమణరెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు మీటింగ్కు రాలేదు.