
హైదరాబాద్, వెలుగు: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి స్థానికత అంశంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. 2018, ఆగస్టులో ప్రభుత్వం జారీ చేసిన జీవో 124లోని స్థానికత నిబంధనల లోపాల కారణంగా వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను స్థాని కులుగా పరిగణించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు.
దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ఇటీవల జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు డివిజన్ బెంచ్ విచారించింది. ఏడో తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు చదవకపోయినా, జూనియర్ అసిస్టెంట్, ఇతర కేటగిరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఆ జిల్లా స్థానిక అభ్యర్థిగా పరిగణించాలని సింగిల్ జడ్జి ఆదేశించడం సరికాదని టీజీపీఎస్సీ వాదన. స్థానికత అంశానికి సంబంధించిన మరికొన్ని పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. వీటన్నింటిపైనా ఈ నెల 26న విచారణ చేపడతామని బెంచ్ వెల్లడించింది.