బీఆర్ఎస్, కాంగ్రెస్  పేదలను మోసం చేస్తున్నయ్ : డీకే అరుణ

బీఆర్ఎస్, కాంగ్రెస్  పేదలను మోసం చేస్తున్నయ్ : డీకే అరుణ

గద్వాల, వెలుగు: ఓట్ల కోసం ఫ్రీ స్కీమ్​ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు పేద ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి బలిగెరా శివారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల కోసం రెండు పార్టీలు అబద్ధపు మాటలు చెబుతున్నాయన్నారు. బీజేపీ ప్రజలకు మేలు చేసే స్కీములు తెచ్చిందని, వాటిని వివరించి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు.

అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజలకు డబ్బులు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, తెలంగాణలో కూడా అలాంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప, అభివృద్ధి కోసం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. బీజేపీ సర్కార్ వస్తే నిరుపేదలకు అండగా ఉండి, యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా శివారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.