చెన్నై : బీజేపీలో చేరిన హీరోయిన్లు నలుగురూ ఐటమ్ లేనంటూ డీఎంకే లీడర్ సైదాయి సాదిక్ శుక్రవారం వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ను కుష్బూ ట్విట్టర్లో పెట్టి తనను ట్యాగ్ చేయడంతో డీఎంకే లీడర్ కనిమొళి సారీ చెప్పారు. ఆ తర్వాత సైదాయి సాదిక్ కూడా సారీ చెప్పారు. అదే సమయంలో తమ పార్టీ లీడర్లను తిట్టినప్పుడు బీజేపీ పెద్దలు స్పందించలేదేమని ఆయన ప్రశ్నించారు.
ఏం జరిగింది..
ఆర్కేపురంలో డీఎంకే ఏర్పాటుచేసిన ఓ పబ్లిక్ మీటింగ్లో సైదాయి సాదిక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీలో చేరిన మాజీ హీరోయిన్లు నలుగురూ ఐటమ్లేనని అన్నారు. తమిళనాడు బీజేపీ నేతలు మాజీ హీరోయిన్లు కుష్బూ, నమిత, గౌతమి, గాయత్రిలను ఉద్దేశించి ఆయనీ కామెంట్స్ చేశారు. బురదలో నుంచే కమలం వికసించినట్లు తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కుష్బూ కామెంట్స్ను ప్రస్తావిస్తూ.. అమిత్ షా నెత్తిపైన జుట్టు మొలుస్తుందేమో కానీ తమిళనాడులో కమలం వికసించేందుకు అవకాశమే లేదని సాదిక్ చెప్పారు.
బహుశా పెంపకలోపమే.. కుష్బూ..
సాదిక్ కామెంట్స్పై బీజేపీ లీడర్ కుష్బూ మండిపడ్డారు. ‘మహిళలను తిట్టే మగవాళ్ల విషయంలో రెండు రకాల పొరపాట్లు జరిగి ఉండొచ్చు.. అయితే, పెంపకంలో లోపం వల్ల లేదంటే వారు విషపూరితమైన వాతావరణంలో పెరగడం వల్ల అలా తయారవుతారు. ఇలాంటి వాళ్లే మళ్లీ దివంగత నేత కలైనార్ ఫాలోవర్లమని చెప్పుకుంటారు. స్టాలిన్ పాలనలో రాష్ట్రంలో ఇలాంటి ద్రవిడ మోడల్నే అమలు చేస్తున్నారా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. కనిమొళిని ట్యాగ్ చేయడంతో ఆమె స్పందించి, క్షమాపణ చెప్పారు.