
రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక లీడ్ రోల్స్లో పోలూరు కృష్ణ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. రెక్కీ, విరాటపాలెం లాంటి సిరీస్ తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మిస్తోంది. అక్టోబర్ 31 నుంచి ఇది జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. తన కూతురు స్వాతి (వసంతిక) కనిపించడం లేదని ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) వెతుకుతుంటాడు. నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు ఎన్నో రహస్యాలు తెలుస్తుంటాయి.
ఆ రహస్యాల వెనుక దాగిన నిజాలు.. ప్రేమ, మోసం మధ్య కనిపించని సన్నని సరిహద్దులు.. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ఎలా సాగిందనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో పోలీస్ ఆఫీసర్గా ఉదయభాను కీలకపాత్ర పోషించారు. యూనివర్సల్ పాయింట్తో మిస్టీరియస్, సస్పెన్స్ఫుల్ నెరేషన్తో సాగే ఈ సిరీస్లో నటించేటప్పుడు ఓ తండ్రిగా ఎమోషన్స్ను ఫీలయ్యానని రాజీవ్ కనకాల చెప్పారు. థ్రిల్లింగ్ కథనం, ఎమోషనల్ కనెక్ట్తో బ్యాలెన్స్ చేసిన ఈ సిరీస్ యూనిక్ కంటెంట్తో మెప్పిస్తుందని ఉదయభాను తెలిపారు.