పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

దేశంలోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతి టైమ్‌‌లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కొన్ని ఊళ్లలో పోటీలు కూడా పెడతారు. కైట్స్‌‌ ఫెస్టివల్స్‌‌ చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్‌‌లో కనిపించే కైట్స్‌‌ మాత్రం డిఫరెంట్‌‌ డిజైన్స్‌‌, కలర్స్‌‌తో ఆకట్టుకుంటాయి. గాలిపటాలు ఎగరేసేందుకే కాదు… ఎగిరే పతంగులను చూసేందుకు చాలామంది వస్తుంటారు. అయితే ఇంతగా ఫేమస్‌‌ అయిన ఈ పతంగుల్ని సంక్రాంతి టైమ్‌‌లోనే ఎందుకు ఎగరేస్తారు అని చెప్పేందుకు కొన్ని కారణాలు కనిపిస్తాయి.

చలికాలం ఫ్లూ సీజన్‌‌. బ్యాక్టీరియా, వైరస్‌‌లు తొందరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఉదయాన్నే లేచి, సూర్యోదయం కాగానే, ఎండకు పతంగులు ఎగరేస్తే విటమిన్‌‌–డి పుష్కలంగా అందుతుంది. అలాగే ఎండ వేడికి హానికర బ్యాక్టీరియా, వైరస్‌‌లు నశిస్తాయని నమ్ముతుంటారు. ఇంకొందరు మాత్రం గాలిపటాలను ఎగరేయడం.. సూర్య భగవానుడికి, ఇతర దేవతలకు కృతజ్ఞతగా ఇచ్చే గౌరవంగా భావిస్తారు. మరికొందరేమో ఆరునెలలు నిద్రావస్థలో ఉన్న దేవుళ్లను మేలుకొల్పడం కోసం పతంగులు ఎగరేస్తారని నమ్ముతారు. నమ్మకాలు ఏవైనా పతంగులు ఎగరేయడం ఎవరికైనా ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.

ట్రెండీ డిజైన్స్‌‌

కైట్స్‌‌ ఫెస్టివల్‌‌లో అయినా, ఇళ్లల్లో పతంగులు ఎగరేసినా కొత్తకొత్త డిజైన్లతో ఉండే పతంగులు ఎగరేసేందుకే అందరూ ఇంట్రెస్ట్‌‌ చూపిస్తున్నారు. అవి కూడా చాలా పెద్ద సైజ్‌‌లో ఉండాలి. అప్పటి ట్రెండ్‌‌కు అనుగుణంగా ఉండే సినిమా స్టార్స్‌‌, స్పోర్ట్‌‌ పర్సనాలిటీస్‌‌‌‌, కొత్త థీమ్స్‌‌‌‌తో ఉండే పతంగుల్నే ఎగరేస్తున్నారు. ఏడాదిగా అందరూ కరోనా గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కరోనా థీమ్స్​తో ఉండే కైట్స్‌‌‌‌కు డిమాండ్‌‌ ఉంది. అలాగే లేటెస్ట్‌‌ సినిమా సెన్సేషన్‌‌ ‘కేజీఎఫ్‌‌’తోపాటు ఇతర సినిమాల ఆధారంగా తయారుచేసిన కైట్స్‌‌ బాగా సేల్‌‌ అవుతున్నాయి.

కరోనా ఉన్నా..

కరోనా కారణంగా ఈ ఏడాది హైదరాబాద్‌‌లో కైట్స్‌‌ ఫెస్టివల్‌‌ జరగలేదు. ఇతర ప్రాంతాల్లోనూ అధికారికంగా పతంగుల పోటీలు పెట్టలేదు. దీంతో ప్రతి ఏడాది కనిపించే సందడి ఈ ఏడాది లేదు. అయితే అందరూ ఎవరికి తగినట్లు వాళ్లు పార్కులు, గ్రౌండ్స్‌‌, డాబాపైన మాత్రం పతంగులు ఎగరేస్తున్నారు. కరోనా ఉన్నా జనం లెక్కచేయడం లేదు. చుట్టు పక్కల వాళ్లతో కలిసి కైట్స్‌‌ ఎగరేస్తూ ఎంజాయ్‌‌ చేస్తున్నారు.

మాంజాపై నిషేధం

పతంగులు ఎగరేసేందుకు చాలా మంది రెగ్యులర్‌‌‌‌ దారాల బదులు చైనా మాంజా వాడుతుంటారు. ఈ మాంజాపై గాజు ముక్కల పొడి పూయడం వల్ల అవి చాలా పదునుగా మారతాయి. దీంతో ఈ మాంజా తగిలి వేరే గాలిపటం దారం తెగిపోతుంది. కానీ, ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటివల్ల పతంగులు ఎగరేసేవాళ్లు కూడా గాయపడ్డ సందర్భాలున్నాయి. చెట్టుకొమ్మల్లో, వైర్లకు చిక్కుకున్న మాంజా తగిలి చాలా పక్షులు చనిపోతాయి. అందుకే ప్రమాదకరమైన వీటిని ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్‌‌ చేసింది. ఇవి అమ్మినా, ఎగరేసినా తప్పే. అలాగే పతంగులు డాబాపైన ఎగరేసేటప్పుడు పైన ఎగిరే పతంగులను చూస్తూ, కింద జారిపడే ఛాన్స్‌‌ ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంట్​ వైర్లు దగ్గర్లో లేకుండా చూసుకోవాలి.

పక్షుల రక్షణ కోసం

మాంజాతోపాటు సాధారణ దారాలు మెడకు చిక్కుకుని చాలా పక్షులు చనిపోతుంటాయి. దీనికి  గుజరాత్‌‌లోని  ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి ఒక సొల్యూషన్ కనిపెట్టారు . గద్ద, గుడ్లగూబ బొమ్మలతో పాటు రెడ్ కలర్ కైట్స్ ను తయారు చేశారు. అలాగే పతంగులపై అల్లం వెల్లులి పేస్ట్ ను రాశారు. గద్ద, గుడ్లగూబ, రెడ్ కలర్‌‌‌‌కు భయపడి పక్షులు దగ్గరకు రాకుండా ఉంటాయి. అలాగే అల్లంవెల్లుల్లి ఘాటుకు దూరంగా వెళ్తాయని తమ రీసెర్చ్ లో తేలిందన్నారు. పక్షులను కాపాడేందుకు ఈ మెథడ్‌‌ను ఫాలో అయితే మంచిదే.