లండన్‌‌లో సెటిలయ్యేందుకు వెళ్తూ..డాక్టర్ దంపతుల ఫ్యామిలీ మొత్తం మృతి

 లండన్‌‌లో సెటిలయ్యేందుకు వెళ్తూ..డాక్టర్ దంపతుల ఫ్యామిలీ మొత్తం మృతి

న్యూఢిల్లీ: గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌‌కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల్లో వృత్తిరీత్యా లండన్‌‌లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక డాక్టర్ దంపతుల కుటుంబం మొత్తం కూడా ఉండటం అందరి మనసులను కలచివేసింది. డాక్టర్ ప్రతీక్ జోషి లండన్‌‌లో జాబ్ చేస్తుండగా..ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ ఉదయపూర్‌‌లోని పసిఫిక్ హాస్పిటల్‌‌లో పనిచేస్తున్నారు. 

వీరికి ఎనిమిదేండ్ల కుమార్తె మిరాయ, ఐదేండ్ల కవల పిల్లలు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. వృత్తిరీత్యా లండన్‌‌లో సెటిల్ అవ్వాలని డాక్టర్ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కోమి వ్యాస్ ఉదయపూర్‌‌లో తన జాబ్ మానేసింది. తన ఫ్యామిలీని లండన్ కు షిఫ్ట్ చేయాలని వారం క్రితం ప్రతీక్ జోషి వారి స్వగ్రామం రాజస్థాన్‌‌లోని బన్స్వారాకు వచ్చారు. గురువారం తన భార్య, ముగ్గురు పిల్లలతో విమానం ఎక్కారు. 

విమానంలో డాక్టర్ జోషి తన ఫ్యామిలీతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ ఫొటోలో ఆయన భార్య ఒకవైపు.. వారి కుమార్తె, ఇద్దరు కొడుకులు నవ్వుతూ కనిపించారు. కానీ అంతలోనే విమానం ప్రమాదానికి గురికావడంతో ఐదుగురితో కూడిన కుటుంబం మొత్తం చనిపోయింది. ప్రమాదంలో డాక్టర్ దంపతుల ఫ్యామిలీ మొత్తం చనిపోవడతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లల్లో  విషాదఛాయలు అలుముకున్నాయి.