
పెద్దపల్లి జిల్లా కేంద్రం సర్కార్ దవాఖానాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా తో మరణించిన డెడ్ బాడీని స్మశానికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ సిబ్బంది ఒప్పుకోలేదు. గంటపాటు ఎదురు చూసినా ఎవరు సాయం చేయకపోవడంతో డాక్టరే స్వయంగా డెడ్ బాడీ ఉన్న ట్రాక్టర్ ను నడుపుకుంటూ స్మశానికి తీసుకెళ్లారు.
పట్టణంలోని తెనుగు వాడకు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 10న పాజిటివ్ వచ్చింది. మెడికల్ సిబ్బంది షుగర్ ఉన్నట్టు గుర్తించి, కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలు తీసుకున్నారు. షుగర్ ఉందని తెలిసి హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని సూచించారు. దీంతో రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 108లో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన తరలించారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం తో అతడు చనిపోయాడు. అతని డెడ్ బాడీ ని తీసుకువెళ్లడానికి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినా.. సదరు డ్రైవర్ ట్రాక్టర్ నడిపేందుకు ఒప్పుకోలేదు. గంటపాటు చూసిన ఎవరు రాలేదు. దీంతో పెద్దపల్లిలో కరోనా వైరస్ కోసం డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీ రామ్ ట్రాక్టర్ నడిపి స్మశానానికి తీసుకెళ్లారు. కాగా పెద్దపల్లి జిల్లాలో 50 మంది కరోనా పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.