రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు వద్దు

రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు వద్దు

న్యూఢిల్లీ : కరోనా టెస్ట్ లను వేగవంతం చేసేందుకు పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు చేయవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్( ఐసీఎంఆర్) సూచించింది. కరోనా నిర్ధారణకు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ లను మాత్రమే చేయాలని సూచించింది. దేశ వ్యాప్తంగా కరోనా టెస్ట్ లకు సంబంధించి ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ను ఫాలో కావాలంటూ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాసింది. రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ ల ద్వారా కచ్చితంగా కరోనా నిర్ధారణ సాధ్యం కాదు. ఏదైనా వైరస్ దాడికి శరీరం గురైనపుడు తెల్లరక్తకణాలు యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీ టెస్టుల్లో వాటినే గుర్తిస్తారు. అలా యాంటీ బాడీస్ ప్రొడ్యూస్ అయిన వారికి మళ్లీ కరోనా టెస్ట్ లు చేయాల్సి ఉంటుంది. కరోనా టెస్ట్ లకు ఖర్చు ఎక్కువగా ఉండటంతో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లనే చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇందుకోసం లక్షల సంఖ్యలో కిట్స్ ను చైనా నుంచి తెప్పించుకున్నాయి. ఆ కిట్స్ సరైన రిజల్ట్స్ ఇవ్వకపోవటంతో రెండు రోజులు వీటిని వాడవద్దని ఇప్పటికే ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలను కోరింది. తాజాగా అసలు ఈ టెస్ట్ లే వద్దని సూచించింది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ల ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ను పాటించాలని కోరింది.