
కోహెడ, వెలుగు: గౌరవెల్లి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోరారు. బుధవారం అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పీసీసీ అబ్జర్వర్ పవన్తో కలిసి పాల్గొని మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పార్టీలో చేరుతామ వస్తే.. వారితో పార్టీకి లాభం ఉంటేనే చేర్చుకుంటామన్నారు. హుస్నాబాద్ నుంచి వయా అక్కన్నపేట, జనగామ హైవేకి ఫోర్ వే వేయాలని కేంద్ర మంత్రి గట్కరీకి లేఖ రాస్తే స్పందించారన్నారు. ఏ సమస్య ఉన్న ఒక ఎస్ఎంఎస్ చేయాలని హైదరాబాద్ వచ్చినా హుస్నాబాద్ వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 1240 ఇండ్లు శాంక్షన్ ఇచ్చి 443 మాత్రమే లబ్దిదారులకు ఇచ్చారని విమర్శించారు. ఇందులో కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామానికి 240 ఇండ్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో మొదటి దశలోనే 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలోనే 45 వేల మందిని కొత్త రేషన్ కార్డుల్లో నమోదు చేశామన్నారు.
అంతకుముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిలో పాల్గొన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ శివ్వయ్య, ఏఎంసీ చైర్పర్సన్ నిర్మల, మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు సుధాకర్, జగన్రెడ్డి, రవీందర్, రాజయ్య, మల్లారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.