
జూలూరుపాడు, వెలుగు: లాటరీలో ఎంపిక చేసి రెండేళ్లు గడుస్తున్నా తమకు డబుల్బెడ్రూం ఇళ్లు అప్పగించడం లేదంటూ లబ్ధిదారులు సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో 51 డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితం ఆఫీసర్లు, దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటికి ఇళ్లను అప్పగించకపోవడంతో శుక్రవారం తహసీల్దార్ ఆఫీసు వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తమకు కేటాయించిన ఇళ్లలో ఇతరులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ టవర్ ఎక్కాల్సి వచ్చిందని, ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో అక్రమంగా ఉంటున్నవారిని ఖాళీ చేయించి లబ్ధిదారులకు అప్పగిస్తామని తహసీల్దార్హామీ ఇవ్వడంతో సెల్టవర్ నుంచి కిందికి దిగారు.