డేంజర్​ జోన్​లో 12 దేశాలు

డేంజర్​ జోన్​లో 12 దేశాలు

వాషింగ్టన్​: మితిమీరిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంక లాంటి పరిస్థితినే మరో 12 దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ డేంజర్​ జోన్​లో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణంతో ఆ దేశాల ఎకానమీ పతనమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చేస్తున్నారు. శ్రీలంక, లెబనాన్, రష్యా, సురినామ్​, జాంబియా ఇప్పటికే డిఫాల్ట్​లోకి (అప్పు లేదా అప్పుపై వడ్డీ చెల్లించలేని పరిస్థితి) వెళ్లిపోయాయని చెప్పారు. ఆ దేశాల బాటలోనే అర్జెంటీనా, ఉక్రెయిన్​, ట్యునీషియా, ఘనా, ఈజిప్ట్​, కెన్యా, ఇథియోపియా, ఎల్​సాల్వడార్​, పాకిస్తాన్​, బెలారస్​, ఈక్వెడార్,  నైజీరియా దేశాలు పయనిస్తున్నాయని వెల్లడించారు. ఆ 12 దేశాల్లో రోజువారి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ‘‘ఆ 12దేశాల్లో 150 బిలియన్​ డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్లు) అప్పుతో అర్జెంటీనా ఫస్ట్​ప్లేస్​​లో ఉంది. రూ.3 లక్షల కోట్లతో ఈక్వెడార్​రెండో స్థానంలో, రూ.4 లక్షల కోట్లతో ఈజిప్ట్​ మూడో స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు రికవర్​అయితే ఇంటర్నేషనల్​ మోనటరీ ఫండ్ మద్దతుతో కొద్దిరోజులు అప్పులు చెల్లించకుండా ఆ దేశాలు తప్పించుకోవచ్చు” అని ఎక్స్​పర్ట్స్​పేర్కొన్నారు.

అర్జెంటీనా
డిఫాల్ట్​లో అర్జెంటీనాది వరల్డ్​ రికార్డు. ఈ దేశ కరెన్సీ పెసో బ్లాక్​ మార్కెట్​లో 50 డిస్కౌంట్​తో ట్రేడ్​అవుతోంది. దేశ రిజర్వులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2024 దాకా అప్పులు తీర్చే పరిస్థితి లేదు. రుణాల కోసం ఐఎంఎఫ్​పై ఆధారపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్​
రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్​ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే దాదాపు రూ.16 లక్షల కోట్ల అప్పును సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా రూ.960 కోట్ల బాండ్ల చెల్లింపులు చేయాల్సి ఉంది.

ట్యునీషియా
ట్యునీషియా డేంజర్​జోన్​లో ఉంది. బడ్జెట్​లో 10% లోటు ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రెసిడెంట్​ కైస్ ​సయిద్​ తన అధికారం నిలుపుకోవడంపైనే శ్రద్ధ చూపుతుండ డంతో అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ​ముందుకు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఘనా
అదేపనిగా అప్పులు తీసుకోవడంతో డెబ్ట్​ టు జీడీపీ రేషియో(దేశ ప్రభుత్వ అప్పు, దాని జీడీపీ మధ్య ఉన్న నిష్పత్తి) 85%కి చేరింది. కరెన్సీ సెడి తన విలువలో 25% కోల్పోయింది. వడ్డీలు చెల్లించడానికే సగం ​రెవెన్యూ ఖర్చు చేస్తోంది. ఇన్​ఫ్లేషన్​ 30శాతానికి దగ్గరలో ఉంది.

ఈజిప్ట్​
ఈజిప్ట్​ డెబ్ట్​ టు జీడీపీ రేషియో 95 %  ఉంది. వచ్చే ఐదేళ్లలో అప్పు 100 మిలియన్​డాలర్లు (రూ.8 లక్షల కోట్లు) కావచ్చని ఎఫ్​ఐఎం పార్ట్​నర్స్​ అంచనా. ఈజిప్షియన్​ పౌండ్​ విలువను ప్రభుత్వం 15% తగ్గించింది. మరిన్ని అప్పుల కోసం ఐఎంఎఫ్​ను అడిగింది. 

కెన్యా
వడ్డీ చెల్లింపుల మీదే తన రెవెన్యూలో కెన్యా 30% ఖర్చు చేస్తోంది. ఈ దేశ బాండ్లు సగం విలువను కోల్పోయాయి. క్యాపిటల్​ మార్కెట్​లో కూడా కరెన్సీకి చోటులేని పరిస్థితి నెలకొంది. కెన్యా అప్పు మరింత ప్రమాదకర స్థాయిలో పెరగవచ్చని మూడీ సంస్థ పేర్కొంది.

పాకిస్తాన్​
దిగుమతులు బాగా పెరిగిపోవడంతో అప్పులు చెల్లించలేని స్థితికి చేరు కుంది. విదేశీ మారక నిల్వలు రూ.78 వేల కోట్లకు తగ్గినయి. రూపాయి విలువ పడిపోయింది. రెవెన్యూలో 40% అప్పుల చెల్లింపుల కోసమే పాక్ ఖర్చు చేస్తోంది.

ఇథియోపియా: సివిల్​ వార్ కారణంగా దేశంలో అభివృద్ధి కుంటుపడింది.

బెలారస్: ఉక్రెయిన్​పై యుద్ధం విషయంలో రష్యాకు సపోర్టు చేయడంతో ఆర్థికంగా కుంగిపోయింది.

ఈక్వెడార్: రెండేళ్ల కిందటే ఈ లాటిన్​ అమెరికా దేశం డిఫాల్ట్​లోకి వెళ్లిపోయింది.

నైజీరియా: అప్పులు చెల్లించడంపైనే ఈ దేశం తన రెవెన్యూలో 30 ఖర్చు చేస్తోంది.

ఎల్​సాల్వడార్ కూడా ఆర్థిక పరిస్థితి కూడా సంక్షోభానికి దగ్గర్లో ఉంది.