
- ఆయా పద్ధతులపై అధ్యయనం చేయాలి : చిన్నారెడ్డి
- వాలంతరీ అధికారులతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి సమావేశం
హైదరాబాద్, వెలుగు : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించే పద్ధతులపై దృష్టి సారించాల్సిందిగా జల, భూ యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ (వాలంతరీ) అధికారులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి సూచించారు. హిమాయత్సాగర్లోని వాలంతరీని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ డైరెక్టర్ నరేందర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నీటి, భూ యాజమాన్య పద్ధతులు, భూ సాంద్రత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా నీటిని వాడుకుని ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించేందుకు కావాల్సిన విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. నీరు, భూ యాజమాన్య అంశాలపై శిక్షణ, పరిశోధన కోసం ఏటా రూ.10 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నా.. పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదన్నారు. దీంతో వాలంతరీ పరిశోధనలు నిలిచిపోయాయని చెప్పారు. అన్ని అంశాలపై అధ్యయనం అనంతరం దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని ఆయన తెలిపారు.