నెల్లూరులో బంగారం పట్టివేత ...స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు .. చెక్ పెట్టిన డీఆర్ఐ

నెల్లూరులో బంగారం పట్టివేత ...స్మగ్లింగ్ తో  హైదరాబాద్ కు లింకులు .. చెక్ పెట్టిన డీఆర్ఐ

నెల్లూరు, హైదరాబాద్ జిల్లాలో అక్రమ బంగారం తరలింపును అధికారులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 10 కేజీలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. వెంకటాచలం టోల్‌ప్లాజా దగ్గర డీఆర్‌ఐ అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద నుంచి పది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ కు చెందిన వ్యాపారులతో ఈ గోల్డ్ లింకులున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ఈ నెల 7వ తేదీ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం టోల్ ప్లాజా వద్ద 7.798 కిలోల విదేశీ బంగారం,ఈ రోజు ( జూన్ 10) హైదరాబాద్ లో మరో 2.471 కిలోల బంగారాన్ని పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కేసుతో సంబంధం వున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు..

విదేశాల నుంచి బంగారం తరలిస్తున్నారని (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో జూన్ 7న నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. టోల్ గేట్ నుంచి వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా అందులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. సీటు కింద దాచి తరలిస్తున్న 7.798 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా .. విదేశాల నుంచి తరలిస్తున్నట్లు బంగారంగా భావించి దర్యాప్తు ముమ్మరం చేయగా మరో విషయం వెలుగుచూసింది. గోల్డ్ స్మగ్లింగ్ కు హైదరాబాద్ కు లింక్ ఉందని తెలుసుకున్నారు.

విదేశాల నుంచి తెచ్చిన బంగారం హైదరాబాద్ లో దాచి ఉంచినట్లు నిందితులు డీఆర్ఐ అధికారులకు తెలిపారు. విచారణలో భాగంగా అధికారుల టీమ్ హైదరాబాద్ కు చేరుకుని తనిఖీలు చేయగా.. నిందితులు చెప్పిన ప్రాంతంలో మరో 2.47 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులతో పాటు, అది తీసుకునేందుకు ఉన్న మరో వ్యక్తిని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.