- 600 మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా ఏజెంట్లు
- హైదరాబాద్లోనూ 168 మంది కస్టమర్లు
హైదరాబాద్, వెలుగు: మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్(60)ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం గోవాలో సోదాలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించారు. డిసౌజా అరెస్ట్ వివరాలను హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. గత నెల 16న ప్రీతీష్ నారాయణ అనే డ్రగ్ సప్లయర్ను హబ్సిగూడలో హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఎక్స్టసీ పిల్స్, 5 ఎల్ఎస్డీ బ్లాట్స్, 4 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించారు.
నారాయణ ఇచ్చిన సమాచారంతో గత శనివారం గోవా వెళ్లారు. గోవాకు చెందిన డిసౌజా నుంచి అతడు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. గోవాలో హిల్ టాప్ సిన్స్ 1983 పేరుతో డీజే ప్లేయర్గా డిసౌజా పనిచేస్తున్నాడు. గోవా బజార్ పేరుతో టూరిస్టులకు పార్టీలు ఏర్పాటు చేస్తుంటాడు. టూరిస్ట్లకు డ్రగ్స్ సప్లయ్ చేస్తాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మరో ఆరుగురిని ఏజెంట్స్గా నియమించుకుని గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు. డిసౌజా నెట్వర్క్లో హైదరాబాద్కు చెందిన ప్రీతీష్ నారాయణ ఏజెంట్గా ఉన్నాడు. ఇతడికి 600 మంది కస్టమర్లు ఉన్నారని, ఇందులో 168 మంది హైదరాబాద్ కస్టమర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు.