బషీర్ బాగ్, వెలుగు: డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రూ. 5 కోట్ల విలువైన గంజాయి, యాష్ ఆయిల్, కోకైన్, ఓపీఎం, అల్ర్పజోలమ్, సంబంధిత పదార్థాలను దహనం చేశారు. నిషేధిత మాదకద్రవ్యాలను కొందరు వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.
2023 నాటికి హైదరాబాద్ పరిధిలోని 28 పోలీస్ స్టేషన్లలో 118 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ. ఐదు కోట్ల విలువైన 528 కిలోల గంజాయి, 1.1 లీటర్ యాష్ ఆయిల్, 15 కేజీల అల్ర్పజోలమ్, 2.5 గ్రాముల చెరాస్, 21 గ్రాముల కోకైన్, 106 మిల్లీ లీటర్ల ఎండీఎంఏ, 1.3 గ్రాముల ఓపియమ్ సీజ్ అయ్యాయి. వీటిని గోషామహల్ పోలీసు గ్రౌండ్లో సీసీఎస్ డీసీపీ శ్వేతా రెడ్డి, ఇతర పోలీసు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
అనంతరం వాటిని డిస్ట్రాయ్ (దహనం, ధ్వంసం)చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి, బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు అధికారికంగా అప్పగించారు. డీసీపీ శ్వేతా రెడ్డి మాట్లాడూతూ..హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సీజ్ చేసిన డ్రగ్స్ డిస్ట్రాయ్ చేశామని పేర్కొన్నారు.
