రెడీ ఫర్​ టీచర్​ జాబ్​.. సెప్టెంబర్ 20 నుంచి అప్లికేషన్స్

రెడీ ఫర్​ టీచర్​ జాబ్​.. సెప్టెంబర్ 20 నుంచి అప్లికేషన్స్

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్​ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 5089 టీచర్​ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌‌లైన్ అప్లికేషన్​ ప్రాసెస్​ మొదలవుతుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ(కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ నేపథ్యంలో ఎగ్జామ్​ ప్యాటర్న్​, ప్రిపరేషన్, సిలబస్​​ గురించి తెలుసుకుందాం.. 

టీచర్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ టెస్ట్‌‌లో ఒక్కో పోస్ట్‌‌కు దాదాపు 61 మంది పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్‌‌ ఉత్తీర్ణుల సంఖ్య దాదాపు 3.5 లక్షలు. వీరంతా దరఖాస్తు చేసుకోవడం ఖాయం. దీంతో.. ఒక్కో పోస్ట్‌‌కు 61 మంది పోటీ పడే పరిస్థితి ఉంది.

వెయిటేజీ: టెట్‌‌కు వెయిటేజీ ఇచ్చే విధానాన్ని యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. రాత పరీక్షకు 80 శాతం; టెట్‌‌ స్కోర్‌‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి.. తుది జాబితా రూపొందిస్తారు. గత రిక్రూట్‌‌మెంట్‌‌ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సారి కూడా వెయిటేజీని అమలు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అర్హతలు

సెకండరీ గ్రేడ్‌‌ టీచర్స్‌‌: ఇంటర్మీడియెట్‌‌ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌ పాసవ్వాలి. (లేదా) నాలుగేళ్ల బ్యాచిలర్‌‌ ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌లో ఉత్తీర్ణత (లేదా) ఎన్‌‌సీటీఈ నిబంధనలు-2002 ప్రకారం-45 శాతం మార్కులతో ఇంటర్‌‌ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌‌ ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌ పాసవ్వాలి. టీఎస్‌‌ టెట్‌‌ లేదా ఏపీ టెట్‌‌ పేపర్‌‌-1లో లేదా సీటెట్‌‌లో అర్హత సాధించాలి. 

స్కూల్‌‌ అసిస్టెంట్స్‌‌: సంబంధిత సబ్జెక్ట్‌‌లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌‌ మెథడాలజీగా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి(లేదా) యాభై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌‌తో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌ బీఈడీ పాసవ్వాలి. 

ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్స్‌‌: ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ ఒక ఎలక్టివ్‌‌ సబ్జెక్ట్‌‌గా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి (లేదా) ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌‌ లేదా బ్యాచిలర్‌‌ ఆఫ్‌‌ ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌(బీపీఈడీ) కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్‌‌: తెలంగాణ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ఇంటర్మీడియెట్‌‌ గుర్తింపు పొందిన ఇన్‌‌స్టిట్యూట్‌‌ నుంచి యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌‌తోపాటు గుర్తింపు పొందిన ఇన్‌‌స్టిట్యూట్‌‌ నుంచి ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో డిప్లొమా ఉండాలి.

ALSO READ: అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్‌‌..ఇది కేసీఆర్ ఘనతే: మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

లాంగ్వేజ్‌‌ పండిట్స్‌‌(భాష పండితులు): సంబంధిత భాష ఒక ఆప్షనల్‌‌ సబ్జెక్ట్‌‌గా బ్యాచిలర్‌‌ డిగ్రీ లేదా సదరు భాష సాహిత్యంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌ (లేదా) పీజీ ఉత్తీర్ణత (లేదా) బ్యాచిలర్‌‌ ఆఫ్‌‌ ఓరియెంటల్‌‌ లాంగ్వేజ్‌‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీలో సంబంధిత భాషను మెథడాలజీగా చదివి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  టీఎస్‌‌ టెట్‌‌ లేదా ఏపీ టెట్‌‌ పేపర్‌‌-2లో అర్హత సాధించాలి (లేదా) మ్యాథమెటిక్స్‌‌; సైన్స్‌‌ లేదా సోషల్‌‌ స్టడీస్‌‌ ఒక ఆప్షనల్‌‌గా సీటెట్‌‌లో అర్హత పొందాలి. 
రాత పరీక్ష : టీచర్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ టెస్ట్‌‌ పరీక్షను 80 మార్కులకు నిర్వహించే అవకాశముంది. ఎస్‌‌జీటీ పోస్ట్‌‌లకు 8 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే వీలుంది. జీకే అండ్‌‌ కరెంట్‌‌ అఫైర్స్, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు చొప్పున, లాంగ్వేజ్‌‌-1, లాంగ్వేజ్‌‌-2, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌‌ స్టడీస్‌‌ సబ్జెక్ట్‌‌ల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌‌లో 18 ప్రశ్నలు చొప్పున అడగనున్నారు.

టీచింగ్‌‌ మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 8 విభాగాల్లో 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.
ఎస్‌‌ఏ రాత పరీక్ష :  స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ పోస్ట్‌‌లకు 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జీకే అండ్‌‌ కరెంట్‌‌ అఫైర్స్‌‌(20 ప్రశ్నలు-10 మార్కులు); విద్యా దృక్పథాలు (20 ప్రశ్నలు-10 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్‌‌ కంటెంట్‌‌ (88 ప్రశ్నలు-44 మా­ర్కులు); టీచింగ్‌‌ మెథడాలజీ (32 ప్రశ్నలు-16 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌‌ విధానంలో ఉంటుంది.

ప్రిప‌‌రేష‌‌న్ టిప్స్​ 

ఎస్‌‌జీటీ అభ్యర్థులు: ఎస్‌‌జీటీ పోస్ట్‌‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. అవి.. విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కంటెంట్. విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు; దేశంలో విద్యా చరిత్ర; ఉపాధ్యాయ సాధికారత, నేషనల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పాలసీ, విద్యాహక్కు చట్టం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కంటెంట్‌‌ కోసం పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి. సోషల్‌‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం; మ్యాథ్స్‌‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు-సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం; తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు; ఇంగ్లిష్‌‌లో పార్ట్స్‌‌ ఆఫ్‌‌ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్‌‌-ప్రిపొజిషన్స్‌‌ తదితర అంశాలపై దృష్టిసారించాలి. 

స్కూల్‌‌ అసిస్టెంట్‌‌:  స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టుల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సబ్జెక్ట్‌‌ పరంగా ప్రత్యేక దృక్పథంతో చదవాలి. సోషల్‌‌ స్టడీస్‌‌ ఎస్‌‌ఏ పోస్ట్‌‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. కంటెంట్‌‌ పరంగా.. భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; భారతదేశ ఉనికి- భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; తెలంగాణ భౌగోళిక అంశాల గురించి అవగాహన పొందాలి. చరిత్రకు సంబంధించి మధ్యయుగప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులపై ప్రత్యేక దృష్టితో చదవాలి. భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి-విధి విధానాలపై అవగాహన పొందాలి. ఎకనామిక్స్‌‌ నుంచి ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి బేసిక్‌‌ కాన్సెప్ట్స్‌‌పై అవగాహన పొందాలి. సోషల్‌‌ స్టడీస్‌‌ మెథడాలజీలో సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధ నోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

డీఎస్సీ నోటిఫికేషన్​ 

ఖాళీలు: మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్‌‌జీటీ- 2,575 పోస్టులు; స్కూల్‌‌ అసిస్టెంట్‌‌- 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు, పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు.
దరఖాస్తులు: సెప్టెంబరు 20 నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు రూ.1000 చెల్లించాలి. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ(కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌‌లైన్‌‌లో కంప్యూటర్ బేస్డ్ 
రిక్రూట్‌‌మెంట్‌‌ టెస్ట్ (సీబీఆర్‌‌టీ) పద్ధతిలో జరుగుతుంది. పూర్తి వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

మ్యాథమెటిక్స్‌‌ స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ అభ్యర్థులు.. కంటెంట్‌‌ పరంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాలపై పట్టుసాధించాలి. మెథడాలజీలో.. గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 

ఫిజికల్‌‌ సైన్సెస్‌‌ స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ అభ్యర్థులు.. మెజర్‌‌మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్, సహజ వనరులు, మన విశ్వం, కాంతి సిద్ధాంతం, ఉష్ణం, ధ్వని విభాగాలకు సంబంధించి ఉండే అన్ని అంశాలను అప్లికేషన్‌‌ విధానంలో నేర్చుకోవాలి. అదే విధంగా అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఫిజికల్‌‌ సైన్సెస్‌‌లో మెథడాలజీకి సంబంధించి బోధన పరికరాలు, మూల్యాంకన పద్ధతులు, బోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై పట్టు సాధించాలి.

బయాలజీ స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ అభ్యర్థులు కంటెంట్‌‌ పరంగా.. జీవ శాస్త్రం-ఆధునిక పద్ధతులు, జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జంతు ప్రపంచం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్‌‌లో మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు గురించి తెలుసుకోవాలి..