ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న ఓ బర్నింగ్ ఇష్యూ నేపథ్యంలో రూపొందుతున్న కోర్ట్ రూమ్ డ్రామా ‘డ్యూ డేట్’. వర్షిష్ స్టూడియోస్ బ్యానర్పై ఏలూరు శ్రీను, పవన్ తరిగోపుల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్.కె. దర్శకత్వం వహిస్తున్నాడు. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, చందు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. లీడ్ యాక్టర్స్పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేశారు.
దర్శకులు విజయ్ కనకమేడల, విఐ ఆనంద్ సహా పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా. ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కథ, కథనాలతో పాటు సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’ అని చెప్పారు.
