
న్యూఢిల్లీ : డిమాండ్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పత్తి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉదాహరణకు గుజరాత్ శంకర్-–6 రకం క్యాండీ ధర రూ.55, 800 (356 కిలోల జిన్డ్ కాటన్) పలుకుతోంది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.66 వేలు పలికింది. కొందరు రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు కూడా అమ్ముతున్నారు. ప్రస్తుత పత్తి సీజన్ (అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు) ప్రారంభమైనప్పటి నుండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) దాదాపు రెండు లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేసింది. తొమ్మిది రాష్ట్రాల్లో పత్తిని ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తున్నామని సీసీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా తెలిపారు.
సీడ్ కాటన్ క్వింటాల్కు ఎంఎస్పీ రూ.6,620 కాగా, పొడవైన పత్తి క్వింటాల్కు రూ.7,020 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల బేళ్లు వస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి మార్కెట్కు 47 లక్షల బేళ్లు వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి 35 లక్షల బేళ్లు వచ్చాయి. “మేం 8–10శాతం పత్తిని ఎంఎస్పీ వద్ద కొనుగోలు చేస్తాం. ధరలు ఎంఎస్పీ కంటే తగ్గడానికి అనుమతించం. ఎంఎస్పీ వద్ద కొనుగోలు చేసినప్పుడు రైతులకు మేలు జరుగుతుంది.
ప్రస్తుతం అనిశ్చితులు ఉన్నాయి. డిమాండ్ పెరిగితే మార్కెట్ మెరుగుపడుతుంది”అని ఆయన అన్నారు. తెలంగాణ పత్తి రైతు జైపాల్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేదని, వెంటనే డబ్బు కావాలనుకునే రైతులు ఎంఎస్పి ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నారని వివరించారు.