వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అవనున్నట్లు తెలిపాడు. గురువారం అబుదాబిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓటమి తర్వాత బ్రావో ఈ ప్రకటన చేశాడు.
‘వీడ్కోలుకు సమయం వచ్చేసింది. నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులతో 18 ఏళ్లుగా వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. కరీబియన్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తా’ అని బ్రావో అన్నాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఫేస్బుక్ లైవ్లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే, టీ20 ప్రపంచకప్లో సెమీస్కు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్ సెమీస్ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ ఆటగాళ్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు.