హైదరాబాద్, వెలుగు:కరోనా టైం నుంచి ఫుల్జోష్ మీద ఉన్న ఈ–లెర్నింగ్ కంపెనీలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. నర్సరీ నుంచి వర్సిటీ స్థాయికి వరకు రెగ్యులర్ఆన్లైన్ లైవ్ క్లాసులు, ట్యూషన్లతో హవా కొనసాగించిన సంస్థలు ప్రస్తుతం స్టూడెంట్స్ లేక డీలా పడిపోతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఫిజికల్ క్లాసులు మొదలైనప్పటి నుంచి ఈ కంపెనీలకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది.
బడా కంపెనీలు టీచింగ్ స్టాఫ్ని, నాన్టీచింగ్స్టాఫ్ను తగ్గించగా, లాక్డౌన్ టైంలో ఏర్పడిన స్టార్టప్లు, యాప్లు మొత్తానికే మూతబడుతున్నాయి. గతంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు స్పెషల్గా యాప్లను డెవలప్ చేయించుకుని వాడాయి. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్అవడంతో కొద్దినెలలుగా మేనేజ్మెంట్లు యాప్లను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఆయా సంస్థల్లో పనిచేసిన ఎంప్లాయ్స్ వేరే జాబ్స్ వెతుక్కుంటున్నారు.
రెండేళ్లలోనే..
వరుస లాక్డౌన్లతో విద్యా సంస్థలు తాత్కాలికంగా మూతబడడంతో ప్రత్యామ్నాయంగా అంతా ఈ–లెర్నింగ్ వైపు మళ్లారు. మొదట్లో ఆన్లైన్చదువు కష్టమైంది. కానీ పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడుతూ వచ్చారు. దీంతో రెండేళ్లలో ఆన్లైన్ఎడ్యుకేషన్ సంస్థల హవా పెరుగుతూ వచ్చింది. బైజూస్, వేదాంత్, అన్అకాడమీ వంటి ఎన్నో బడా ఈ–లెర్నింగ్ సంస్థలు పరిధిని పెంచాయి. స్టూడెంట్ల సంఖ్యను బట్టి సిబ్బందిని నియమించుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి స్టూడెంట్ల డేటా సేకరించేందుకు మార్కెటింగ్ సిబ్బందిని కూడా తీసుకున్నాయి. వీటితోపాటు సిటీ వ్యాప్తంగా చిన్న, పెద్ద స్టార్టప్లు, యాప్లు, వెబ్ సైట్లు వేల సంఖ్యలో పుట్టుకొచ్చాయి.ప్రైవేట్ టీచర్లకు ఆన్లైన్ లెర్నింగ్తో డిమాండ్ పెరిగింది. వారితో ఆయా సంస్థలు వన్ టు వన్ క్లాసులు, లైవ్ క్లాసులు చెప్పించారు. అలా బడా కంపెనీలకు కోట్లలోనే లాభాలొచ్చాయి. స్టార్టప్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
పరిస్థితులు తారుమారు
స్కూళ్లు, కాలేజీలు సార్ట్ అయ్యాక పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు వేలమంది విద్యార్థులు జాయిన్ అయిన సంస్థల్లో ఇప్పుడు వందల్లో కూడా కనిపించడంలేదు. ఆన్లైన్లెర్నింగ్ ప్లాట్ ఫామ్లకు అడ్మిషన్లు రావట్లేదు. నష్టాల్లో పడిపోయిన సంస్థలు టీచర్లను మెల్లిమెల్లిగా తొలగిస్తు న్నాయి. కొన్ని స్టార్టప్లు చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే మూతబడుతున్నాయి. యాప్లు తయా రుచేసిన వాళ్లు కూడా యూజర్లు లేకపోవడంతో సంస్థలను క్లోజ్ చేస్తున్నారు. ఇలా మొన్నటివరకు అధికంగా ఆదరణ పొందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు ఇప్పుడు మూతపడుతున్నాయి.ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మళ్లీ స్కూళ్లలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ట్యూటర్లుగా మారుతున్నారు. ఇంకొందరు చిరువ్యాపారాలు చేసుకోవడం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం వంటివి చేస్తున్నారు. ఈ–లెర్నింగ్ సంస్థల ద్వారా సిటీలో దాదాపు 5వేల నుంచి 10వేల మంది టీచర్లు ఉపాధి పొందారని ఇప్పుడు వారంతా వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షబ్బీర్ అలీ తెలిపారు.
ప్రత్యామ్నాయం మాత్రమే
కరోనా టైంలో ఆన్లైన్ఎడ్యుకేషన్ని ఎంచుకోవడం అప్పటి పరిస్థితులకు ప్రత్యామ్నాయం మాత్రమే. అప్పుడే ఈ–లెర్నింగ్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. స్కూళ్లు రీఓపెన్ చేశాక వీటి అవసరం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతోంది. పేరెంట్స్కు ఆన్లైన్, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ మధ్య తేడా తెలియడంతో లాభ, నష్టాలు అర్థమయ్యాయి. ఫిజికల్క్లాసులే మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ–లెర్నింగ్ యాప్స్వాడే స్టూడెంట్స్చాలా వరకు తగ్గిపోయారు. కేవలం ట్యూషన్లు, డౌట్స్ కోసమే ఉపయోగిస్తున్నారు. ఆన్ లైన్కు క్రేజ్తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ– సంస్థలు ఆఫ్లైన్లోకి మారుతున్నాయి.
- వంశీధర్, కో-ఫౌండర్, రైజ్ ఈ-లెర్నింగ్ యాప్
ఎవరూ వాడకపోవడంతో క్లోజ్ చేసినం
గతేడాది అడాడ్ సొల్యూషన్స్ పేరుతో ఎడ్యుకేషన్ యాప్ క్రియేట్ చేశాం. 350 నుంచి 400 మంది టీచర్లతో సీబీఎస్సీ, స్టేట్ బోర్డు సిలబస్ రికార్డ్ చేయించుకుని పూర్తిస్థాయిలో యాప్ రన్చేశాం. 10 వేలకు పైగా సబ్స్క్రైబ్ చేసుకు న్నారు.10,500 స్కూళ్లు, కాలేజీలు యాప్ని కొనుగోలు చేశాయి. కాగా డిసెంబర్ నుంచి సబ్ స్క్రైబర్లు తగ్గిపోగా, ఉన్నవాళ్లు కూడా వాడట్లేదు. చేసేది లేక సంస్థను క్లోజ్ చేశారు.
- నాగార్జున, యాప్ డెవలప్పర్, అడాడ్ సొల్యూషన్స్
5 నెలల జీతం ఇయ్యలే..
నేను తెలుగు టీచర్ని. కరోనా టైంలో జాబ్పోవడంతో ఈ–లెర్నింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. 25 వేల జీతం ఇస్తామన్నారు. దాదాపు 9 నెలలు వర్క్ చేయించుకున్నారు. మొదటి 2 నెలలు జీతం మంచిగానే ఇచ్చారు. తర్వాత సాకులు చెప్తూ దాటవేశారు. చివరికి చెప్పా పెట్టకుండా కంపెనీని ఎత్తేశారు. ఐదు నెలల జీతం రావాల్సి ఉంది.
- ప్రవీణ్రావు, టీచర్, కూకట్పల్లి