ఏఐతో క్యాన్సర్లను ముందే గుర్తిస్తున్నం

ఏఐతో క్యాన్సర్లను ముందే గుర్తిస్తున్నం
  •  టెక్నాలజీతో వ్యాధుల గుర్తింపు, చికిత్స సులభమైనయ్: తమిళిసై 
  •  పేదలకూ టెక్నాలజీ అందుబాటులోకి రావాలె
  •  ట్రీట్మెంట్ల ఖర్చు తగ్గాలె 
  •  బయో ఏషియా సదస్సు ముగింపు సభలో గవర్నర్ 
  •  సదస్సులో 2,800 మీటింగ్స్ జరిగాయ్: శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: మోడ్రన్ టెక్నాలజీతో వ్యాధుల గుర్తింపు, చికిత్సలు సులభతరం అయ్యాయని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని సృష్టించాక క్యాన్సర్లను సైతం ఎర్లీ స్టేజీల్లోనే గుర్తించేందుకు వీలవుతోందని చెప్పారు. క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తిస్తేనే చికిత్సలు చేయడం సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్​లోని హెచ్ఐసీసీ నొవాటెల్​లో 3 రోజుల ‘బయోఏషియా’ సదస్సు బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో గవర్నర్​ తమిళిసై, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన 5 స్టార్టప్ కంపెనీలకు గవర్నర్ అవార్డులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మెడికల్, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో టెక్నాలజీ పెరుగుతున్నదని, అయితే అది పేద ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి రావాలన్నారు. టెక్నాలజీతో వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే కాకుండా, తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్లు చేయాలన్నారు. ప్లెబెక్ అనే స్టార్టప్ తయారు చేసిన రోబోటిక్ అల్ట్రా సౌండ్ పరికరం తనను బాగా ఆకర్షించిందన్నారు. 
 
‘‘అల్ట్రాసౌండ్ టెస్టు కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గర్భిణులు ఎంతో ఇబ్బందిపడేవారు. గర్భిణుల్లో తొలి 3 నెలల్లో అల్ట్రా సౌండ్ స్కాన్ చేయకుంటే పిండంలోని లోపాలు తెలియవు. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి రోబోటిక్ అల్ట్రాసౌండ్ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ కాబట్టి ప్రజలకు ఎంతో మేలు’’ అని చెప్పారు.  

యంగ్ ట్యాలెంట్ బయటకొచ్చింది: మంత్రి

బయో ఏషియా సదస్సులో యంగ్ ట్యాలెంట్ బయటకొచ్చిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సదస్సులో 2,800 బిజినెస్ మీటింగ్స్ జరిగాయని, ఐదు ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు కూడా హాజరయ్యారని తెలిపారు. పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు. లైఫ్​సైన్స్ రీసెర్చ్ కోసం ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్)తో కలిసి సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్​)ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో డేటా ఆధారిత హెల్త్ ఎకోసిస్టమ్ భివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. 

కాగా, బయోఏషియా సదస్సు సూపర్ సక్సెస్ అయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంతో పోలిస్తే స్టార్టప్​లు, ప్రైవేటు వ్యక్తులు ఎక్కువమంది సదస్సుకు హాజరయ్యారని పేర్కొంది. 200 స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయని, 2,737 మంది డెలిగేట్స్, 700 మంది విజిటర్లు వచ్చారని తెలిపింది. 

డబ్ల్యూఈఎఫ్ ‘హెల్త్ కేర్’ సెంటర్ ప్రారంభం  

రాష్ట్రంలో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్​) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్)ను ఏర్పాటు చేశారు. హెల్త్​కేర్ అండ్ లైఫ్​సైన్సెస్​పై ఫోకస్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్ దీనిని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్లు 19 ఉండగా.. హెల్త్​కేర్ రంగంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సీ4ఐఆర్ ఏర్పాటయిన రోజే నాలుగు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు జరగడం విశేషం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, డిజిటల్ మెడికల్ సొసైటీ(డైమ్​), గార్మిన్ హెల్త్, కాలిక్స్ ఏఐతో సీ4ఐఆర్ ఒప్పందం జరిగింది. హెల్త్​కేర్, లైఫ్​సైన్సెస్ సెక్టార్​లో నైపుణ్యాభివృద్ధి, సాఫ్ట్​వేర్ మెడికల్​ డివైజెస్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ అనలిటిక్స్​వంటి వాటిపై ఈ సెంటర్ దృష్టిపెట్టనుంది.