హైదరాబాద్, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నెల 23న గంట పాటు అనవసర లైట్లు ఆర్పేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎర్త్ అవర్లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని కోరారు. మంగళవారం సెక్రటేరియెట్లో ‘ఎర్త్ అవర్’ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాణీ ప్రసాద్ మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవ- వైవిధ్య నష్టం నుంచి గట్టెక్కించేందుకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఎర్త్ అవర్ పాటించాలని కోరారు.సెక్రటేరియెట్, దుర్గం చెరువు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ లైబ్రరీ రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలోనూ లైట్లు ఆర్పేయాలని వాణీ ప్రసాద్ పిలుపునిచ్చారు.
