- ఈటలకు ఘన స్వాగతం
- శంషాబాద్ నుంచి శామీర్పేట వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయం సొసైటీ కార్యదర్శి మంగళవారం మీడియాకు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇప్పటికే రాజీనామా చేసిన ఈటల.. టీఆర్ఎస్ సర్కారులో ఉండగా వచ్చిన ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని కూడా వదులుకున్నారు.
ఘన స్వాగతం పలికిన అభిమానులు
బీజేపీలో చేరిన తర్వాత ఢిల్లీ నుంచి మంగళవారం హైదరాబాద్లో చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఘన స్వాగతం లభించింది. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, పలువురు నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు అభిమానులు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు దగ్గర నుంచి భారీ కాన్వాయ్తో ఈటల శామీర్పేటలోని తన ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ ఇంటికి చేరుకోవడానికి సాయంత్రం 4.30 వరకూ పట్టింది. మధ్య, మధ్యలో పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకడం, మహిళలు హారతులు పట్టడంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎయిర్ పోర్టు నుంచి శామీర్ పేట దారి పొడవునా అభిమానులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈటల ఇంటికి చేరుకున్నాక.. తన కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, పార్టీ కేడర్, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కొద్ది సేపు మాట్లాడి, కృతజ్ఞతలు చెప్పారు. కాగా, అంతకుముందు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే రూట్లో పోలీసులు భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈటలను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను అక్కడక్కడా అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.