కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు

కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు
  • ఇటు సూర్యుడు అటు పొడిచినా కేసీఆర్ ఇగ గెల్వనే గెల్వడు
  • ఆయనపై ప్రతీకారం తీర్చుకుంట: ఈటల
     

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు. హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు భూమ్మీదికి దిగొచ్చిండు. ఫామ్ హౌజ్ నుంచి బయటికొచ్చి ధర్నాచౌక్ లో పడ్డడు. కేసీఆర్ వ్యూహాలన్నీ నాకు తెలుసు. ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంట. ఇటు సూర్యుడు అటు పొడిచినా కేసీఆర్ గెలవడు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగే రోజులు దగ్గర్నే ఉన్నయి” అని హుజూరాబాద్ బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. హుజూరాబాద్ తీర్పు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రళయం రానుందని, దాన్ని కేసీఆర్ తట్టుకోలేరని అన్నారు. ‘‘ప్రజలే చరిత్ర నిర్మాతలు. అట్ల కాకుంటే పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీ ప్రధాని అయ్యేవారు కాదు. ప్రజలు న్యాయం, ధర్మం పాటించకుంటే నేను మళ్లీ ఎమ్మెల్యే అయ్యేవాన్ని కాదు. మోడీ ప్రభుత్వం మీద ఒక్క మరక లేదు. ఒక్క స్కాం లేదు. ఆకలి తెలిసిన వ్యక్తి ప్రధాని అయితే ఏం చేయొచ్చో ఆయన చూపించారు. ధాన్యం కొనలేక కేంద్రంపై కేసీఆర్‌‌ నెపం మోపిండు. రైస్ మిల్లులు పెట్టలేకపోయినందుకు కేసీఆర్‌‌ రెండు చెంపలు వేసుకోవాలి. బియ్యం కొనలేకపోయానని ఒప్పుకోవాలి. కేసీఆర్‌‌ అబద్ధాలు ప్రజలకు అర్థమయ్యాయి. ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. ప్రజల కన్నీళ్లకు పరిష్కారం బీజేపీతోనే.  పవర్ కోసం కాదు, ప్రజల కోసం బీజేపీ అధికారంలోకి రావాలి” అని అన్నారు.