- ఏఎమ్ఆర్ కంపెనీలో ఈసీ, ఐటీ సోదాలు
- ఈ నెల 10న రూ.3.35 కోట్లు పట్టుకున్న టాస్క్ఫోర్స్
- కర్నాటక నేతకు లింకులున్నాయనే సమాచారంతో రెయిడ్స్
- మూడు రోజులుగా కొనసాగుతున్న తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: ఏఎమ్ఆర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు శనివారం రాత్రి వరకు కొనసాగాయి. జూబ్లీహిల్స్ ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ సమీపంలోని ఏఎమ్ఆర్ చైర్మన్, ఎండీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఇంటితో పాటు శ్రీనగర్ కాలనీలోని కార్పొరేట్ ఆఫీస్ సహా మొత్తం12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్(ఈసీ) అధికారులు కూడా ఐటీ అధికారులతో కలిసి సోదాలు జరిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ రికార్డులను తనిఖీ చేశారు. హార్డ్డిస్క్లు, ల్యాప్టాప్స్ సీజ్ చేశారు.
కర్నాటక నుంచి డబ్బు తరలింపు?
ఏఎమ్ఆర్ సంస్థ దేశ విదేశాల్లో భారీ ప్రాజెక్ట్లు చేపట్టింది. మైనింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సివిల్ ప్రాజెక్ట్లు నిర్వహిస్తున్నది. బెంగళూరులోని పలు కంపనీలతో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కర్నాటకకు చెందిన ఓ నాయకుడికి మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఎన్నికల తనిఖీల్లో భాగంగా సిటీ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నెల 10న బంజారాహిల్స్లో రూ.3.35 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు బెంగళూర్ తో లింకులు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. దీంతో బెంగళూర్, హైదరాబాద్లో ఈసీ ఆధ్వర్యంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.